Begin typing your search above and press return to search.

టీడీపీ అంటే..టెంప‌ర‌రీ డెవ‌ల‌ప్‌ మెంట్ పార్టీ

By:  Tupaki Desk   |   10 April 2017 2:11 PM GMT
టీడీపీ అంటే..టెంప‌ర‌రీ డెవ‌ల‌ప్‌ మెంట్ పార్టీ
X
పార్టీ ఫిరాయింపులను స‌మ‌ర్థించుకోవ‌డ‌మే కాకుండా వారికి ఏకంగా మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే - పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఫిరాయించడం తప్పుకాదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బుగ్గన ఫైర్ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించకుండా మంత్రి పదవులు ఇవ్వడం రాజ్యాంగానికి విరుద్ధమని పదవ షెడ్యూల్ చెబుతున్నా కూడా చంద్రబాబు చట్టాన్ని ఉల్లంఘించార‌ని పేర్కొన్నారు. పట్టపగలే వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచిన 21మంది ఎమ్మెల్యేలకు కండువాలు కప్పడమే గాకుండా ఏకంగా వాళ్లలో నలుగురికి మంత్రి పదవి ఇచ్చి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడని బుగ్గ‌న‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్ర‌తిపాద‌న‌తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించడం దారుణమన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా బాబు అవినీతి, అసమర్థ పాలనను అడ్డగిస్తే...అది అభివృద్ధికి అడ్డంపడుతున్నట్లు ఎలా అవుతుందని బాబును సూటిగా ప్ర‌శ్నించారు.

చంద్రబాబుకు పూర్తి మెజారిటీ ఉన్నా ఇతర పార్టీ నుంచి గెలిచిన 21మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవసరం ఏం వ‌చ్చిందని బుగ్గ‌న ప్ర‌శ్నించారు. ఎక్కడైనా సంకీర్ణం ద్వారా మెజారిటీ ప్రభుత్వం ఏర్పడుతుందని...కానీ ఏపీలో మాత్రం మెజార్టీ ప్రభుత్వాన్ని బాబు సంకీర్ణ ప్రభుత్వంగా మార్చారని తూర్పారబట్టారు. ఇద్దరు బీజేపీ మంత్రులు, నలుగురు వైఎస్సార్సీపీ మంత్రులతో కూడిన కేబినెట్‌ ను చూస్తే ఈ విధంగా కూడ రాజకీయాలుంటాయా అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నార‌ని అన్నారు. రాష్ట్రంలో ఏది జరిగినా అది వైఎస్ జగన్ మీదికి నెట్టడం బాబుకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. పదవిలో ఉన్నాం కదా అని ఏది వస్తే అది ఊరికే అందరి మీద బురదజల్లడం సరికాదని బాబుకు హితవు పలికారు. దివంగ‌త సీఎం వైఎస్ఆర్ పాలనలో ఫిరాయింపులు జరగలేదా అని టీడీపీ నేతలు మాట్లాడడంపై బుగ్గ‌న ఘాటు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు వ‌లే ఏనాడు కూడ వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పలేదని, మంత్రులను చేయలేదని చురక అంటించారు.

ఏపీ స్థూల ఉత్పత్తి11.56 శాతం సాధించిందని బాబు గర్వంగా చెప్పుకోవ‌డాన్ని బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఎద్దేవా చేశారు. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఉత్పిత్తి పెరుగుల 3 శాతం ఉందని, చైనా 6శాతం ఉంటే భారతదేశం చైనా కంటే ఎక్కువగా సాధించారా అని ఎకనామిస్ట్ లు చెబుతుంటే..బాబు ఏకంగా 11.56 శాతమని చెప్పడం శోచనీయమన్నారు. ప్రపంచంలోనే ఫస్ట్ అని బాబు చెప్పుకుంటున్నప్పుడు ఆయనకు ఎవరు అడ్డొచ్చారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే లెక్కలన్నీ తప్పులతడకలేనని బుగ్గన దుయ్యబట్టారు. టీడీపీని చంద్రబాబు టెంపరరీ డెవలప్ మెంట్ పార్టీగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్ర అప్పు 97వేల కోట్లు ఉందని, ఆయనొచ్చాక 2017-18 బడ్టెజ్ అంచనాలు చూస్తే 2లక్షల 16వేల కోట్లుగా ఉందని చెప్పారు. మూడేళ్లలో లక్ష 20వేల కోట్లు అప్పు చేశారని బుగ్గ‌న‌ ఆరోపించారు. 60 ఏళ్ల ఆంధ్ర ప్రదేశ్ అప్పు 97కోట్లు అయితే బాబు వచ్చిన రెండేళ్లలోనే లక్ష 20వేల కోట్లకు అప్పు పెంచారని పేర్కొన్నారు. అంత అప్పు చేయొద్దని చెబితే ఎనాడైనా విన్నారా బాబు..? అని నిప్పులు చెరిగారు. రాజ‌ధాని విష‌యంలో బాబు తీరు హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. సింగపూర్, జపాన్, మలేషియా, ఇస్తాంబుల్‌, ఆస్థానా అంటూ చివరకు రాజధాని మాస్టర్ ప్లాన్ రాజమౌళి దగ్గరకి వచ్చిందని ఎధ్దేవా చేశారు. ఇక‌నైనా గ్రాఫిక్స్ ఆపి ప‌ని మొద‌లు పెట్టాల‌ని బుగ్గ‌న కోరారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/