Begin typing your search above and press return to search.

మ‌రో ప‌దిరోజుల్లో బ‌డ్జెట్‌: స్టాక్ మార్కెట్ల ప‌రుగులు.. హిస్టరీ వాచ్‌!

By:  Tupaki Desk   |   19 Jan 2021 4:27 PM IST
మ‌రో ప‌దిరోజుల్లో బ‌డ్జెట్‌:  స్టాక్ మార్కెట్ల ప‌రుగులు.. హిస్టరీ వాచ్‌!
X
మ‌రో ప‌ది రోజుల్లో కేంద్ర ప్ర‌భుత్వం వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నుంది. ఏటా ఇది స‌ర్వ‌సాధార‌ణ‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడున్న ఆర్థిక ప‌రిస్థితి నేప‌థ్యంలో ఉద్దీప‌న‌ల‌కు ఎక్కువ‌గా ఛాన్స్ ఉండే అవ‌కాశం క‌నిపిస్తోంది. క‌రోనా అనంత‌రం నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కేంద్రం అన్ని రంగాల‌ను ఇతోధికంగా ఆదుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే గతానికి భిన్నంగా ఇప్పుడు బ‌డ్జెట్‌కు ముందు.. స్టాక్ మార్కెట్లు ప‌రుగులు పెడుతున్నాయి. వాస్త‌వానికి ప్ర‌తి ఏటా.. బ‌డ్జెట్‌కు ముందు స్టాక్ మార్కెట్లు డీలా ప‌డుతుంటాయి. ప‌న్నులు పెంచుతారేమో.. ధ‌ర‌లు పెరుగుతాయేమో.. అనే భ‌యం వెంటాడుతుంది.

ఈ క్ర‌మంలోనే బ‌డ్జెట్‌కు ముందు మార్కెట్లు ఊగిసలాటలో ఉండటం సహజం. 2010 నుండి బడ్జెట్‌కు ముందు నెల రోజుల్లో సెన్సెక్స్ 7సార్లు నష్టపోగా, మూడు సార్లు మాత్ర‌మే లాభపడింది. వ‌రుస‌గా బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి నెల రోజుల ముందు 2010, 2011, 2013, 2014, 2015, 2016, 2020లో సెన్సెక్స్ నష్టపోయిం ది. అయితే.. ఇప్పుడు దీనికి భిన్నంగా ప‌రిస్థితి మారింది. మ‌రో ప‌ది రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామ‌న్ 2021-22 సంవ‌త్స‌రానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ సారి డిజిట‌ల్ మాధ్య‌మంలో ప్ర‌వేశ పెడుతుండ‌డం విశేషం.

అయితే.. గ‌తానికి భిన్నంగా బడ్జెట్‌కు ముందు సెన్సెక్స్ 49,000 మార్కు దాటి ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకిం ది. నిఫ్టీ 14,500 క్రాస్ చేసింది. 2020లోను బడ్జెట్‌కు ముందు సూచీలు ప‌రుగులు పెట్టినా.. త‌ర్వాత మాత్రం మ‌దుప‌రుల ఆశ‌లు అడియాస‌లు చేశాయి. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రాన్నిప‌రిశీలిస్తే.. కరోనా కారణంగా 2020-21 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి. ఇన్వెస్టర్లు లక్షల కోట్లు నష్టపోయారు. అయితే ఆగస్ట్, సెప్టెంబర్ నుండి క్రమంగా కోలుకోవడం ప్రారంభించింది. భారీ నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. గత ఆరు నెలలుగా ఇన్వెస్టర్లు మంచి రిటర్న్స్ అందుకుంటున్నారు. గత రెండు నెలల కాలంలో సెన్సెక్స్ 47 వేల నుండి 49వేల మార్కుకు చేరుకుంది. ఇప్ప‌టికీ అదే దూకుడు కొన‌సాగుతోంది. అయితే.. మున్ముందు కూడా ఇదే ప‌రిస్థితి ఉంటుందా? అంటే సందేహ‌మేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తంమీద‌.. బ‌డ్జెట్‌కు ముందు.. ఉండే ప‌రిస్థితిలో ఇప్పుడు భిన్న‌మైన వాతావ‌ర‌ణం క‌నిపించ‌డం మాత్రం.. ఆసక్తిగా మారింది.