Begin typing your search above and press return to search.

ప్రణయ్ ఉదంతాన్ని తలపించేలా హైదరాబాద్ లో పరువు హత్య

By:  Tupaki Desk   |   25 Sept 2020 3:40 PM IST
ప్రణయ్ ఉదంతాన్ని తలపించేలా హైదరాబాద్ లో పరువు హత్య
X
హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. కొద్దికాలం క్రితం మిర్యాలగూడలో ప్రణయ్ హత్య ఉదంతం గుర్తుండే ఉంటుంది. గర్భవతి అయిన భార్యను ఆసుపత్రిలో చూపించి తిరిగి వస్తుంటే.. అందరూ చూస్తుండగానే దారుణహత్యకు పాల్పడిన వైనం తెలిసిందే. ఇదే తరహాలో మరో హత్య చోటు చేసుకుంది. సినిమా తరహాలో కిడ్నాప్ చేసి చంపేసిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. గురువారం కిడ్నాప్.. హత్య జరిగితే.. ఆలస్యంగా ఈ ఉదయం (శుక్రవారం) బయటకు వచ్చింది. అసలేం జరిగిందన్నది చూస్తే..

చందానగర్ కు చెందిన హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతిరెడ్డిని ప్రేమించాడు. ఈ క్రమంలో వారి ప్రేమను అమ్మాయి తండ్రి లక్ష్మారెడ్డి ఒప్పుకోలేదు. దీంతో.. హేమంత్ ను మర్చిపోలేని అవంతి.. ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకొంది. దీంతో.. ఆమె తండ్రి రగిలిపోతున్నారు. ఇదిలా ఉంటే.. వీరిద్దరు గుట్టుచప్పుడు కాకుండా గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో కాపురం పెట్టారు. ఈ విషయం అవంతి తండ్రికి తెలిసింది.

కోపంతో రగిలి పోతున్న ఆయన.. ఎలాగైనా మట్టుబెట్టాలన్న ఆవేశం తో కిరాయి మూక కు సుపారి ఇచ్చినట్లుగా చెబుతున్నారు. గురువారం మధ్యాహ్నం గుర్తు తెలియని వారు వచ్చి వీరిని కిడ్నాప్ చేశారు. వీరి బారి నుంచి అవంతి తప్పించుకోగా.. హేమంత్ వారికి దొరికి పోయాడు. తన భర్త ను ఎవరో తెలీని వారు కిడ్నాప్ చేసినట్లు గా బాధితురాలు డయల్ 100 కు ఫోన్ చేసి చెప్పింది. అంతలోనే.. జరగాల్సిన దారుణం జరిగిపోయిందంటున్నారు.

హేమంత్ ను కిడ్నాప్ చేసిన కిరాయిమూకలు అతడ్ని సంగారెడ్డికి తీసుకెళ్లి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఉదయం హేమంత్ డెడ్ బాడీ కనిపించటంతో అతడి హత్య వ్యవహారం బయటకు వచ్చింది పిల్ల తండ్రే తమ కొడుకును హత్య చేయించి ఉంటారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.