Begin typing your search above and press return to search.

భారత పర్యటనకు బ్రిటన్ పీఎం.. మొసలి అంటూ పుతిన్ పై ధ్వజం

By:  Tupaki Desk   |   21 April 2022 8:10 AM GMT
భారత పర్యటనకు బ్రిటన్ పీఎం.. మొసలి అంటూ పుతిన్ పై ధ్వజం
X
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య యుద్ధంగా మారి రెండు నెలలు కావొస్తోంది. 5 రోజుల్లో ముగుస్తుందనుకున్న యుద్ధం 60 రోజులైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి రష్యా వెళ్లిపోయింది. అయితే, తమకు పట్టున్న, రష్యన్ భాష మాట్లాడే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డాన్ బాస్ పై కన్నేసింది. లుగాన్స్క్, డొనెట్స్క్ లను వశపర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు మారియుపోల్ ను దాదాపు గుప్పిట్లోకి తీసుకుంది.

ఇక ఈ నేపథ్యంలో భారత పర్యటనకు బయల్దేరారు యూకే (బ్రిటన్) ప్రధాని బోరిస్ జాన్సన్. ఇది ప్రాధాన్యం సంతరించుకునే అంశమే. ఇటీవల బోరిస్.. యూకే వెళ్లి, కీవ్ వీధుల్లో్ తిరిగారు. రష్యా సైన్యం సాగించిన అరాచకాలను కళ్లారా చూశారు. అలాంటి బోరిస్ జాన్సన్.. భారత్ కు రానుండడం అందరినీ ఆలోచింపజేస్తోంది. అయితే, భారత్ బయల్దేరడానికి ముందు ఆయన బ్రిటన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యుద్ధానికి చర్చలతో ముగింపు రాదు..

ఉక్రెయిన్‌, రష్యా యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు దొరుకుతుందని చెప్పలేమన్నారు. పుతిన్ తో చర్చలను మొసలితో చర్చలు గా పేర్కొన్నారు. ‘ఉక్రెయిన్‌ను చుట్టిముట్టి స్వాధీనం చేసుకోవాలని పుతిన్‌ భావిస్తున్నట్లు ఆయన వ్యూహాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో చిత్తశుద్ధి లేనప్పుడు పుతిన్‌తో ప్రస్తుతం చర్చలు జరపడం ఉక్రెయిన్‌కు కష్టమే. మీ కాలు మొసలి (పుతిన్‌ను పోల్చుతూ) దవడలో చిక్కుకుపోయినప్పుడు దానితో చర్చలు ఎలా జరుపుతారు? అంటూ బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడారు. ఇటువంటి సమయంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేయడం అత్యంత అవసరమని అన్నారు.

అందుకే ఉక్రెయిన్‌ను బ్రిటన్‌తోపాటు మిగత నాటో దేశాలు ఆయుధాలను సరఫరా చేసే ప్రణాళికను కొనసాగిస్తాయని స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌ సంక్షోభాన్ని ముగింపు పలికేందుకు ఇరు దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ రష్యాకు చిత్తశుద్ధి లేనందున అవి విఫలమవుతూనే ఉన్నాయని బ్రిటన్‌ ప్రధాని విచారం వ్యక్తం చేశారు. అంతేకాకుండా కీవ్‌పై రష్యా మరోసారి మెరుపుదాడి చేసే అవకాశం ఉందన్నారు.

ఇదే సమయంలో తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాడులను మరోసారి ముమ్మరం చేసినందున ఉక్రెయిన్‌కు అండగా నిలబడంలో భాగంగా అమెరికాతోపాటు ఇతర దేశాధినేతలు ఈ వారం మరోసారి చర్చించేందుకు అంగీకరించారని బోరిస్‌ జాన్సన్‌ వెల్లడించారు. ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న బోరిస్‌ జాన్సన్‌ ఉక్రెయిన్‌ అంశాన్నీ ప్రధాని మోదీతో ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

నేడు అహ్మదాబాద్ కు బోరిస్

బోరిస్ జాన్సన్ భారత్‌లో రెండు రోజుల పాటు పర్యటిస్తారు. ఇది వ్యూహాత్మక రక్షణ, వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని జాన్సన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల ప్రజల అనుబంధాన్నీ ఇనుమడింపజేస్తుందని తెలిపారు. తన విదేశీ పర్యటనను పురస్కరించుకొని బుధవారం బ్రిటన్‌ పార్లమెంటు దిగువసభలో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘నా భారత్‌ పర్యటన రెండు దేశాల సంబంధాలను మరింత వేళ్లూనుకునేలా చేస్తుంది. దిల్లీలో ప్రధాని మోదీని, పారిశ్రామివేత్తలను కలుస్తాను’ అని జాన్సన్‌ తెలిపారు. తన ఆహ్వానం మేరకు కార్బిస్‌ బే జీ7 సదస్సులో మోదీ పాల్గొన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జాన్సన్‌ లండన్‌ నుంచి నేరుగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరానికి గురువారం చేరుకుంటారు. అక్కడి నుంచి దిల్లీ వెళ్తారు. శుక్రవారం ప్రధాని మోదీతో, వాణిజ్య ప్రతినిధులతో భేటీ అవుతారు.