Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు

By:  Tupaki Desk   |   28 Jun 2021 9:18 AM GMT
బ్రేకింగ్ :  ఏపీలో 8 జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపు
X
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువ ఉన్న అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. జూలై 1వ తేదీ నుంచి ఆయా జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వగా.. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. ఇకపోతే ,ఇదిలా ఉంటే కరోనా పాజిటివిటీ రేట్ 5 శాతం కంటే ఎక్కువ ఉన్న పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఆంక్షలే కొనసాగుతాయి.

ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే కార్యకలాపాలకు అనుమతి ఉంటుందని, ఆ తర్వాత రాత్రి 6 గంటల తర్వాత నుంచి కర్ఫ్యూ కఠినంగా అమలు అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. కాగా, జూలై 1 నుంచి 7 వరకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. మరోవైపు జూలై 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలింపులు ఉన్న నేపథ్యంలో బ్యాంకుల టైమింగ్స్‌లోనూ మార్పులు జరగనున్నాయి. ఆయా జిల్లాల్లోని బ్యాంకులు అన్ని కూడా ఎప్పటిలానే సాధారణ సమయాల్లో పని చేసే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత రానుంది.

ఇదిలా ఉంటే .. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 44,773గా ఉంది. ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాలు 12,599.జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్‌ మరణాల వివరాలిలా ఉన్నాయి. కృష్ణ జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, కర్నూల్‌లో ఇద్దరు చొప్పున, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.