Begin typing your search above and press return to search.

టీడీపీ బేరాన్ని వైసీపీ వైపు లాగుతున్న బొత్స

By:  Tupaki Desk   |   23 Nov 2015 9:54 AM GMT
టీడీపీ బేరాన్ని వైసీపీ వైపు లాగుతున్న బొత్స
X
ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై మండిపడుతున్న మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి, ఆయన సోదరుడు వివేకాలు కాంగ్రెస్ పార్టీని వీడడం దాదాపు ఖాయమైపోయింది. అయితే.... వారు ఏపార్టీలో చేరాలనే విషయంలో మాత్రం కొంత ఇరకాటంలో పడినట్లుగా తెలుస్తోంది. తొలుత వారు టీడీపీలో చేరడానికి సిద్ధమై రాయబారాలు నడిపినా ఆ తరువాత రాంనారాయణరెడ్డి మిత్రుడు బొత్స సత్యనారాయణ ఎంటరవడంతో వారి నిర్ణయం పెండింగులో పడింది. వైసీపీలోకి రావాలంటూ బొత్స వారిని ఆహ్వానించడంతో వారు కాదనలేక, అవుననలేక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.

ఆనం వివేకానంద రెడ్డి - ఆనం రామనారాయణ రెడ్డి సోదరులను తమ పార్టీలోకి తీసుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ రాయబారాలు నడుపుతున్నారు. రాంనారాయణతో బొత్సకు మంచి స్నేహం ఉంది. ఇద్దరూ గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు కావడం, సమకాలికులు కావడం, బొత్స కలుపుగోలుతనం వంటివన్నీ వారి మధ్య మంచి సంబంధాలు ఏర్పడడానికి కారణమయ్యాయి. ప్రస్తుతం వైసీపీలో కీలకంగా ఉన్న బొత్స ఆ చనువుతోనే ఆనం బ్రదర్స్ ను వైసీపీలోకి రావాలని పిలుస్తున్నారు.

కాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆనం సోదరులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఏకచత్రాధిపత్యం కోసం రఘువీరా జిల్లాలవారీగా తన వర్గానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆనం బ్రదర్స్ ఆరోపిస్తున్నారు. జిల్లా పార్టీలో తమకు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ పనబాక లాంటి వాళ్లకు అధిక ప్రాముఖ్యం ఇస్తున్నారని ఆనం సోదరులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ కోసం తాము ఎంతో చేశామని, ఇప్పుడు తాము అవమానాలకు గురి కావాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌పార్టీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్న వారు ఇప్పటికే సంకేతాలిచ్చారు. అయితే... అధికార పక్షంలో చేరుతారా.. లేదంటే మిత్రుడు బొత్స మాట వింటారా అన్నది తేలాలి.