Begin typing your search above and press return to search.

కరోనా బాధితులకు బూస్టర్ డోసు ఎప్పుడు?.. కేంద్రం కీలక సూచనలు

By:  Tupaki Desk   |   22 Jan 2022 5:30 PM GMT
కరోనా బాధితులకు బూస్టర్ డోసు ఎప్పుడు?.. కేంద్రం కీలక సూచనలు
X
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరాళ నృత్యం చేస్తోంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతూనే టీకా ప్రక్రియపై వివిధ దేశాలు దృష్టి సారించాయి. మనదేశంలోనూ వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. సాధారణ టీకా పంపిణీతో పాటు 15-18 ఏళ్ల పిల్లలకు కూడా టీకా ఇస్తున్నారు. అంతేకాకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్, అరవై ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు అందిస్తున్నారు. మరి ఇటీవల కరోనా బారిన పడిన వారికి బూస్టర్ డోసు ఎప్పుడు ఇవ్వాలనేదానిపై క్లారిటీ లేదు. వివిధ రాష్ట్రాల అభ్యర్థనల మేరకు కేంద్రం కీలక సూచనలు చేసింది.

ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వారికి.. ప్రికాషన్ డోసు ఎప్పుడు ఇవ్వాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాశాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాలని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు ఇచ్చిన సూచనల ప్రకారం కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి వికాశ్ షీల్ రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మేరకు వివిధ రాష్ట్రాలకు లేఖలు రాశారు. కొవిడ్ నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాతే వారికి ప్రికాషన్ డోసు ఇవ్వాలని స్పష్టం చేశారు.

కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాతి నుంచే బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఈ విషయంపై సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కరోనాను జయించిన తర్వాత వారి శరీరంలో యాంటీబాడీలు ఉంటాయి. కాబట్టి వారికి మూడు నెలల వరకు టీకా అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ మేరకు కోలుకున్న నాటి నుంచి మూడు నెలల తర్వాతే బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.

కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతోంది. గత నెల నుంచి పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశంలో మూడో వేవ్ ప్రారంభమైందని నిపుణులు చెబుతున్నారు. రోజూవారీ కేసులను అంచనా వేస్తూ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఈ మేరకు వ్యాక్సినేషన్ పై ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,37,704 మందికి వైరస్ సోకింది. మరో 488 మంది మహమ్మారి ధాటికి బలయ్యారు. కాగా దేశంలో రోజూవారి పాజిటివిటీ రేటు 17.22 శాతానికి చేరిందని కేంద్రారోగ్య శాఖ వెల్లడించింది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఒమిక్రాన్ వేరియంట్ వల్ల థర్డ్ వేవ్ ముంచుకొచ్చింది. అయితే ఈ కొత్త వేరియంట్ తో ప్రాణాలకు ప్రమాదం ఉండబోదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ అతివేగంగా వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వెల్లడించారు.