Begin typing your search above and press return to search.

కోవిడ్ వేళ.. మన కుబేరుల సత్తా ఎంతో చెప్పిన బ్లూమ్ బెర్గ్

By:  Tupaki Desk   |   14 Dec 2020 1:00 PM GMT
కోవిడ్ వేళ.. మన కుబేరుల సత్తా ఎంతో చెప్పిన బ్లూమ్ బెర్గ్
X
వణికిస్తున్న కోవిడ్ 19 పుణ్యమా అని జాతీయ.. అంతర్జాతీయంగా పలువురు వ్యక్తులు..సంస్థలను దారుణంగా దెబ్బ తీసింది. ఆర్థికంగా పరీక్షా కాలంగా మారిన ఈ సమయంలో దేశీయ కుబేరులు పలువురు తమ సత్తా చాటటమే కాదు.. తమ ఆస్తుల్ని భారీగా పెంచుకున్న వైనాన్ని బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఈ ఏడాదిలో భారత్ కు చెందిన ఏడుగురు కుబేరుల సంపాదన 60 బిలియన్ డాలర్లు జమైంది. దీంతో వీరి సంపద దాదాపుగా 200 బిలియన్ డాలర్లకు చేరుకోవటం గమనార్హం.

కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి వెళ్లినా దేశీయ కుబేరుల సంపద మాత్రం యాభై శాతం పెరిగినట్లుగా పేర్కొంది. వీరిలో అంబానీ.. గౌతమ్ ఆదానీ.. అజీమ్ ప్రేమ్ జీ.. శివనాడార్.. డీ మార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ తదితరులు ఉన్నారు. తొలితరం పారిశ్రామవేత్త గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద 21.1 బిలియన్ డాలర్లకు పెరిగింది. ముకేశ్ అంబానీ సంపద అయితే 18.1 బిలియన్ డాలర్ల వృద్ధితో 76.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

వ్యాక్సిన్ల తయారీ కంపెనీ సీరమ్ ఇన్ స్టిట్యూట్ వ్యక్తిగత సంపద భారీగా పెరిగింది. ఈ ఏడాది అతడి ఆస్తికి 6.91 బిలియన్ డాలర్లు జత కావటంతో అతని వ్యక్తిగత సంపద 15.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఐటీ దిగ్గజాలు హెచ్ సీఎల్ టెక్నాలజీస్ చీఫ్ శివనాడార్.. విప్రో అధినేత ప్రేమ్ జీ సంపద సంయుక్తంగా 12 బిలియన్ డాలర్ల మేర పెరిగినట్లుగా వెల్లడించింది. ఇక.. లాక్ డౌన్ వేళలో భారీగా వ్యాపారం చేసిన డీమార్ట్ స్టోర్ల అధినేత రాధాకిషన్ దమానీ సంపద 4.71 బిలియన్ డాలర్లతో మొత్తం 14.4 బిలియన్ డాలర్లైంది. హెల్త్ కేర్ దిగ్గజం సన్ ఫార్మా చీఫ్ దిలీప్ సింఘ్వీ సంపద 2.23 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 9.69 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇలా.. ప్రతికూల వాతావరణంలోనూ మన కుబేరుల సంపద భారీగా పెరగటం విశేషం.