Begin typing your search above and press return to search.

ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లను తాగిన విధేయుడు!

By:  Tupaki Desk   |   17 Sep 2018 11:03 AM GMT
ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లను తాగిన విధేయుడు!
X
ఈ స్పీడ్ ప్ర‌పంచంలో మ‌న మార్క్ చూపించాలంటే సమ్ థింగ్ స్పెష‌ల్ అన్న‌ట్లు ఉండాలి. అలాంటి ప‌నులు చేసేందుకు దేనికైనా రెఢీ అనే బ్యాచ్ ఒక‌టి ఉంటుంది. తాజాగా అలాంటి వ‌ర్గానికే చెందిన నేత ఒక‌రు చూపించిన విధేయ ప్ర‌ద‌ర్శ‌న షాకింగ్ గా మార‌ట‌మే కాదు.. సంచ‌ల‌నంగా మారింది.

విధేయ పిచ్చ ఉండొచ్చు కానీ.. మ‌రీ ఇంత పైత్య‌మా? అన్న‌ట్లుగా ఉన్న ఈ వ్య‌వ‌హారం దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని.. స‌ద‌రు నేత త‌న విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శించుకునేందుకు చేసిన ప‌నిని ప‌లువురు మండిప‌డుతున్నారు. జార్ఖండ్‌లోని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఒక‌రు. అత‌గాడి మ‌న‌సును దోచుకోవాల‌ని భావించిన ఒక కార్య‌క‌ర్త ఎవ‌రూ ఊహించ‌ని ప‌ని చేశాడు.

గొడ్డాలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న ఎంపీ వ‌ద్ద‌కు వెళ్లి.. ఆయ‌న పాదాల్ని ఒక ప‌ళ్లెంలో పెట్టి.. శుభ్రంగా క‌డిగేశాడు. అనంత‌రం ట‌వ‌ల్ తో చ‌క్క‌గా తుడిచాడు. ఆ పై ఆ నీటిని తీర్థం మాదిరి పుచ్చుకున్నాడు. మిగిలిన నీటిలో కొంత భాగాన్ని త‌న త‌ల‌పై చ‌ల్లుకున్నాడు. దీంతో.. స‌ద‌రు కార్య‌క‌ర్త తీరును అంద‌రూ ఆశ్చ‌ర్య‌క‌రంగా చూశారు బీజేపీలో వ్య‌క్తి పూజ ఏ స్థాయిలో పెరిగిపోతుంద‌న‌టానికి తాజా ఉదంతం ఒక చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా అభివ‌ర్ణిస్తున్నారు. ఈ ఉదంతంపై విప‌క్ష పార్టీలు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. బీజేపీ నేత‌లు మాత్రం ఈ ప‌రిణామాన్ని స‌మ‌ర్థించుకోవ‌టం విశేషం. జార్ఖండ్‌లో ఇలా గౌర‌వించుకోవ‌టం మామూలేన‌ని.. మ‌హాభార‌తంలో సుదామ విష‌యంలో శ్రీ‌కృష్ణుడు ఇలానే చేశారంటూ దూబే స‌మ‌ర్థించుకున్నాడు.

ఏదో ఒక‌రోజు తాను ప‌వ‌న్ (కాళ్లు క‌డిగిన కార్య‌క‌ర్త‌) కాళ్లు క‌డిగే అవ‌కాశం వ‌స్తుంది. అలాంటి కార్య‌క‌ర్త‌ల ప్రోత్సాహం ఉండ‌టంతోనే నేను ఇలా ప్ర‌జాజీవితంలో ఉన్నాన‌ని చెప్ప‌టం గ‌మ‌నార్హం. ఫ‌ర్లేదు.. పైత్యం ప‌రాకాష్ఠ‌కు చేరుకోవ‌టం అంటే ఇదేనేమో?