Begin typing your search above and press return to search.

మరో స్టార్ హీరోను కెలుకుతున్న బీజేపీ?

By:  Tupaki Desk   |   5 July 2021 10:30 AM GMT
మరో స్టార్ హీరోను కెలుకుతున్న బీజేపీ?
X
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక ధోరణి అయితే పెరిగిపోయిందని.. మోడీ, హిందుత్వ భక్తుల వాయిస్ లో కొంచెం బేస్ వచ్చిందన్న విమర్శలున్నాయి. ఇక బీజేపీని ప్రశ్నిస్తే వారిని 'దేశ ద్రోహులుగా' ముద్ర వేసే సంస్కృతి పెరిగిందన్న వాదన ఉంది. ఈ ఒరవడి తమిళనాడులో ఇంకా ఎక్కువగానే ఉందన్న విమర్శలున్నాయి.

తమిళనాట బీజేపీకి అక్కడి హీరోలకు అస్సలు పడదు. అక్కడి ప్రజలు కూడా బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడినవారే.. 'జల్లికట్టు'ను రద్దు చేయాలన్న కేంద్రం తీరుపై పెద్ద ఉద్యమమే తమిళులు చేశారు.

ఇక స్టార్ హీరో విజయ్ అయితే తన సినిమా 'మెర్సల్' బీజేపీ విధానాలను విమర్శిస్తూ సినిమా తీశారు. ఆ తర్వాత ఆయనను బీజేపీ టార్గెట్ చేసి నేతలు ఎన్ని విమర్శలు చేశారో చూశాం. ఇక విజయ్ పై ఐటీ దాడులు కూడా జరగడం కలకలం రేపింది.

ఇక మరో స్టార్ హీరో అజిత్ కూడా బీజేపీలో చేరుతున్నారని వార్తలు రావడం.. ఆయన దాన్ని తోసిపుచ్చి తాను బీజేపీలో అస్సలు చేరను అనడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శించారు.

ఇప్పుడు మరో స్టార్ హీరో సూర్య వంతు వచ్చింది. తమిళనాడు బీజేపీకి హీరో సూర్య టార్గెట్ అయ్యారు. అప్పట్లో నీట్ గురించి సూర్య చేసిన కామెంట్లపై బీజేపీ రాష్ట్ర యువజన కార్యవర్గం తీవ్రంగా మండిపడింది. నేషనల్ ఎలిజిబిలిటి ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షల నిర్వహణ విషయంలో హీరో సూర్య ఈ కామెంట్స్ చేశారు. నీట్ జాతీయ పరీక్ష వల్ల తమిళనాడులోని పేద విద్యార్థులు నష్టపోతున్నారని.. ఆ స్థాయి లేక సీట్లు సంపాదించలేకపోతున్నారని హీరో సూర్య వాపోయారు. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం పరీక్షలు నిర్వహించడం సరికాదని పేర్కొన్నారు. ప్రాణభయంతో ఒక పక్క న్యాయమూర్తులే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపడుతున్నారని.. తీర్పులను ఇస్తున్నారని విద్యార్థులను బలిపశువులుగా చేయవద్దని కామెంట్ చేశారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య విద్యార్థులు ప్రాణభయం లేకుండా ధైర్యంగా పరీక్షలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. అయితే సూర్య సదుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినా అందులో బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం దుమారం రేగింది. హీరో సూర్య వ్యాఖ్యలు బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేసేలాగా ఉన్నాయని.. భారతీయ న్యాయవ్యవస్థను తప్పుపట్టేలా వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ శ్రేణులు విమర్శించారు. కరోనా పరిస్థితుల మధ్య ఈ పరీక్షలను రాయాల్సి వచ్చినందు వల్ల తీవ్ర ఒత్తిడికి గురైన ముగ్గురు తమిళ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సూర్య ఈ వ్యాఖ్యలు చేశారు.

హీరో సూర్య సదుద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసినా బీజేపీ మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ తప్పు పట్టడాన్ని విశేషం. మోడీ నీట్ గురించి అవాస్తవాలు ప్రచారం చేయడమే కాకుండా.. మోడీ ప్రభుత్వ ప్రజా సంక్షేమ విధానాలను కూడా తన సొంత ప్రయోజనాల కోసం.. ప్రమోషన్ కోసం వ్యతిరేకిస్తున్నాడు అని ఈ తీర్మానం పేర్కొంది. సూర్య తన సినిమాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకూదని బీజేపీ నేతలు తాజాగా గట్టి హెచ్చరికను సూర్యకు ఇచ్చారు.