Begin typing your search above and press return to search.

బీజేపీ క‌త్తికి రెండువైపులా ప‌దునా? ఏపీపై షాకింగ్‌ రాజ‌కీయం

By:  Tupaki Desk   |   27 Sept 2020 9:00 AM IST
బీజేపీ క‌త్తికి రెండువైపులా ప‌దునా? ఏపీపై షాకింగ్‌ రాజ‌కీయం
X
కేంద్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న వైఖ‌రి.. ఏపీపై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోందా? కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు అనుస‌రిస్తున్న వ్యూహంతో ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఏర్ప‌డి.. అవి రాజ‌కీయ కార‌ణాలుగా మారి.. ఇక్క‌ట్లు తెస్తున్నాయా? అంటే.. తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. నిజానికి దేశ‌వ్యాప్తంగా ఎలాంటి ప‌రిస్థితి ఉన్నా.. కేంద్రం ఇత‌ర రాష్ట్రాల‌ను ఎలా చూస్తున్నా.. ఏపీ విష‌యానికి వ‌చ్చే స‌రికి మాత్రం భిన్న‌మైన ఆర్ధిక‌ వాతావ‌ర‌ణం.. భిన్న‌మైన ప‌రిస్థితి ఉన్నాయి. విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల్సిన బాధ్య‌త కేంద్రంపై ఉంది.

అదేస‌మ‌యంలో హోదా విష‌యంలో తేల్చాల్సి ఉంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం అంటోంది. ఇక‌, పోల‌వ‌రం ప్రాజెక్టుకు రాష్ట్రం ఖ‌ర్చు చేసిన ఐదు వేల కోట్ల రూపాయల‌ను కూడా రీయింబ‌ర్స్‌మెంట్ చేయాల్సింది కేంద్ర‌మే. వెనుక బ‌డిన జిల్లాల‌కు నిధులు ఇవ్వాలి. ఇక‌, జీఎస్టీ బ‌కాయిలు.. చెల్లించాల్సి ఉంది. వెర‌సి దాదాపు పాతిక వేల కోట్ల వ‌ర‌కు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటి విష‌యంలో రాష్ట్ర స‌ర్కారు త‌ర‌ఫున మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నారు. అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆయ‌న ఢిల్లీ టూరుకు వెళ్లి .. మంత్రుల‌ను క‌లుస్తున్నారు. అయినా.. కేంద్రం క‌రుణించ‌డంలో శీత‌క‌న్నేస్తూనే ఉంది.

పైగా.. మేం ఇవ్వం.. మీరు అప్పులు చేసుకోండి! అని చెబుతున్న విష‌యం కూడా తెలిసిందే. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఏపీ సీఎం అప్పులు చేసుకునేందుకు అవ‌స‌రమైన గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుని ముందుకు సాగుతున్నారు. అంటే.. కేంద్రం ఇవ్వ‌క‌పోయినా.. త‌న ప‌నేదో తాను చేసుకుంటున్నారు. కానీ, ఆయ‌నను అదే బీజేపీ నేత‌లు ఊరుకోనే ఉండ‌నివ్వ‌క పోవ‌డ‌మే ఇప్పుడు చిత్రంగా మారింది. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం అప్పుల పాల‌వుతోంద‌ని, జ‌గ‌న్‌ కు పాలించ‌డం రావ‌డం లేద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్..ఏపీ స‌ర్కారు పై విరుచుకు ప‌డ్డారు.

జ‌గ‌న్ ప్ర‌భుత్వం అప్పులు చేసేసి.. ప్ర‌జ‌ల నెత్తిన కుంప‌టి పెడుతోంద‌న్నారు. దీంతో అరె.. కేంద్రంలో ఉన్న‌ది కూడా బీజేపీ ప్ర‌భుత్వ‌మే(ఎన్డీయే అయిన‌ప్ప‌టికీ.. బీజేపీ కే మెజారిటీ ఉంది)కదా.. నిధులు ఇవ్వ‌నన్న‌ది.. అప్పు చేసుకుని పాల‌న చేసుకోమ‌ని చెప్పింది వారే కాదా? కానీ, రాష్ట్రంలోకి వ‌చ్చే స‌రికి స‌ర్కారును ఇబ్బంది పెట్టేలా? ఇరుకున ప‌డేలా వ్యాఖ్య‌లు చేస్తున్న‌ది కూడా బీజేపీ నాయ‌కులే క‌దా? ఇదేం రాజ‌కీయ‌మ‌బ్బా!! అని వైసీపీ నేత‌లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఇలా అయితే.. మున్ముందు ఇరు పార్టీల మ‌ధ్య మ‌రింత గ్యాప్ పెర‌గుతుంద‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టి కైనా బీజేపీ నేత‌లు గ్ర‌హిస్తారో లేదో చూడాలి.