Begin typing your search above and press return to search.

రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అధికారం అంద‌దా?

By:  Tupaki Desk   |   11 Feb 2020 11:00 PM IST
రాష్ట్రాల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అధికారం అంద‌దా?
X
హర్యానాలో ప్ర‌జ‌లు బీజేపీని తిర‌స్క‌రించారు. అయితే ఏదోలా అధికారాన్ని అందుకుంది. ఆ పై మ‌హారాష్ట్ర‌లో ఏదోలా అధికారంలోకి చేజిక్కింద‌ని అనుకున్నా శివ‌సేన హ్యాండివ్వ‌డంతో అధికారం చేజారింది. ఐదేళ్ల కింద‌ట చేజిక్కిన జార్ఖండ్ ఇటీవ‌లే చేజారింది! 2019 లోక్ స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ.. రాష్ట్రాల వారీగా మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీ ఏ మాత్రం అనుకూల ఫ‌లితాలు క‌నిపించ‌డం లేదు. ఒక రాష్ట్రంలో త‌ర్వాత మ‌రో రాష్ట్రంలో ఎదురుదెబ్బ‌లు త‌గులుతూ ఉన్నాయి క‌మ‌లం పార్టీకి. ఒక‌వైపు ప్ర‌జా స‌హ‌స్య‌ల‌ను భార‌తీయ జ‌న‌తా పార్టీ పూర్తిగా ప‌క్క దారి ప‌ట్టించింద‌నే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

ఆర్థిక మాంద్యం, నిరుద్యోగిత స్థాయి పెర‌గ‌డం వంటి అంశాల‌ను బీజేపీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అనేక మంది వాపోతూ ఉన్నారు. ఎంత‌సేపూ హిందుత్వ అజెండాను అమ‌లు పెట్టాల‌ని చూడ‌టం త‌ప్ప భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌జ‌ల‌కు ఏం కావాలో ఆలోచించ‌డం లేద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఎన్ఆర్సీ, సీఏఏ చిచ్చును బీజేపీ ర‌గ‌ల్చింది. అది కాగుతూ ఉండ‌ట‌మే మంచిద‌ని క‌మ‌లం పార్టీ భావించి ఉంద‌ని అనేక మంది అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు. దేశం మతం కోణం మీద విడిపోతే అధికారం త‌మ చేజార‌దు అనేది బీజేపీ వ్యూహం అనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి క్ర‌మంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌లు ఆస‌క్తిదాయ‌కంగా నిలిచాయి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌న రొటీన్ అస్త్రాల‌న్నింటినీ వాడింది. త‌మ వైరి ప‌క్ష పార్టీల‌ను దేశ ద్రోహులుగా అభివ‌ర్ణించారు బీజేపీ నేత‌లు. త‌మ విధానాల‌ను వ్య‌తిరేకించే వారి ప‌ట్ల తీవ్ర ప‌ద‌జాలాన్ని వాడి కొంద‌రు కేంద్ర‌మంత్రులు కూడా ఎన్నిక‌ల ప్ర‌చార నిషేధాన్ని ఎదుర్కొన్నారంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌త‌ప‌ర‌మైనే ఉద్రిక్త‌త‌లు రెచ్చ‌గొట్టేలా మాట్లాడి ఓటు అడిగిన కొంద‌రు బీజేపీ నేత‌ల‌పై ఈసీ నిషేధాజ్ఞ‌లు విధించింది. వారు ప్ర‌చారం చేయ‌డానికి వీళ్లేద‌ని ఈసీ తేల్చింది. ఈ స్థాయిలో జ‌రిగింది బీజేపీ ప్ర‌చారం. అయినా వారు ఆశించిన ప్ర‌యోజ‌నం మాత్రం ఫ‌లితాల్లో క‌నిపించిన‌ట్టుగా లేదు. ప్ర‌జ‌లు త‌మ త‌మ రాష్ట్రాల వ‌ర‌కూ వ‌చ్చే స‌రికి బీజేపీ అజెండాల‌ను ప‌ట్టించుకోలేదు. ఏ లెక్క‌లో గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీకి అధికారం ద‌క్కిందో కానీ.. రాష్ట్రాల్లో మాత్రం క‌మ‌లం పార్టీని ఓట‌ర్లు చిత్తు చేస్తూ ఉన్నారు.

ఇక ఇంత‌టితో ఈ వ్య‌వ‌హారం అయిపోలేదు. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత బీహార్ లో బీజేపీ ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనాల్సి ఉంది. అక్క‌డ బీజేపీ జేడీయూతో అధికారాన్ని పంచుకుంటూ ఉంది. బీజేపీ విధానాల‌ను జేడీయూ స‌మ‌ర్థించ‌డం లేదిప్పుడు. మ‌రి అక్క‌డ బీజేపీ కూట‌మిని ప్ర‌జ‌లు ఎలా ట్రీట్ చేస్తారో!