Begin typing your search above and press return to search.

టికెట్ ఇప్పించ‌లేద‌ని ఎంపీని తాళ్ల‌తో క‌ట్టేశారు

By:  Tupaki Desk   |   27 Jan 2017 7:20 AM GMT
టికెట్ ఇప్పించ‌లేద‌ని ఎంపీని తాళ్ల‌తో క‌ట్టేశారు
X
రాజ‌కీయ నేత‌లు త‌మకు వ్య‌తిరేకంగా ప‌రిస్థితి కొంచెం మారిపోయినా ఏ విధంగా రియాక్ట్ అవుతారో తెలియజేసేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న వారికి కాకుండా కొత్త వ్యక్తికి అసెంబ్లీ టిక్కెట్‌ ఇవ్వడంతో బీజేపీ కార్యకర్తలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ క్రమంలోనే స్థానిక ఎంపీతో పాటుగా పార్టీ జిల్లా యూనిట్‌ చీఫ్‌లను వారు తాళ్లతో బంధించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఫయిజాబాద్‌ జిల్లాలో చోటు చేసుకున్నది.

బీఎస్పీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన వేద్‌ గుప్తాకు జిల్లాలోని అయోధ్య స్థానం నుంచి టిక్కెట్‌ ఇచ్చారు. కాగా దీనిని స్థానిక కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. ఇదే విషయమై బీజేపీ జిల్లా కార్యాలయానికి కార్యకర్తలందరూ చేరుకున్నారు. అక్కడే ఉన్న స్థానిక ఎంపీ లల్లూ సింగ్‌ - పార్టీ జిల్లా చీఫ్‌ అవదేశ్‌ పాండేలను నిలదీశారు. అగ్ర‌నేత‌లు స‌ముదాయించే ప్రయత్నం చేసినా కార్యకర్తలు వినలేదు. త‌మ‌కు న్యాయం చేయాల్సిందేన‌ని కోరారు. అయితే ఒక్క‌సారి టికెట్ కేటాయింపు జ‌రిగి త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు ఉన్న నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌ను మార్చ‌డం సాధ్య‌మ‌య్యే ప‌నికాద‌ని వివ‌రించారు. దీంతో ఆగ్ర‌హంతో ఊగిపోయిన‌ కార్యకర్తలు ఎంపీ లల్లూసింగ్‌ - బీజేపీ జిల్లా అధ్య‌క్షుడు అవ‌దేశ్‌ పాండేలను తాళ్లతో బంధించారు. ఇలా ఏకంగా రెండు గంటల పాటు అలాగే ఉంచారు. ఈ వార్త దావాన‌లం వ్యాపించి పార్టీ పెద్ద‌ల‌కు చేర‌డం, వారు రంగంలోకి దిగ‌డంతో పరిస్థితిలో మార్పు వ‌చ్చింది. కార్యకర్తల అభిప్రాయాలను పార్టీ రాష్ట్ర కమిటీ ముందు ఉంచుతామని స్పష్టమైన హామీ రావడంతో ఎంపీని - జిల్లా అధ్య‌క్షుడిని విడిచి పెట్టారు. కాగా వేద్‌ గుప్తా బయటి వ్యక్తి అని, ఆయనకు పార్టీ టిక్కెట్‌ ఇవ్వడం సరైంది కాదని బీజేపీ కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఇన్నాళ్లు తాము పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తే త‌మ‌ను కాద‌ని ఇపుడు వ‌చ్చిన వ్య‌క్తికి టికెట్ ఇవ్వ‌డం ఏంటని బీజేపీ అగ్ర‌నేత‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/