Begin typing your search above and press return to search.

ఎంత పని జరిగింది; డ్రైనేజీలో పడిన మహిళా ఎంపీ

By:  Tupaki Desk   |   16 May 2016 1:35 PM GMT
ఎంత పని జరిగింది; డ్రైనేజీలో పడిన మహిళా ఎంపీ
X
తన నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు.. తాను అండగా ఉంటానంటూ ధైర్యం చెప్పేందుకు వెళ్లిన మహిళా ఎంపీకి చేదు అనుభవం ఎదురైంది. తన నియోజకవర్గంలో ప్రజల్ని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా ఎంపీ.. అక్కడి అధికారులతో మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె డ్రైనేజీలో పడిపోవటం సంచలనం సృష్టించింది. ఈ ఊహించని పరిణామం గుజరాత్ లో చోటు చేసుకుంది.

జామ్ నగర్ బీజీపీ ఎంపీ పూనమ్ బెన్ మాదమ్ తన నియోజకవర్గంలోని మురికివాడలో అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకునేందుకు వెళ్లారు. అధికారుల తీరుపై స్థానికులు ఆమె వద్దకు వెళ్లి.. తమకు అండగా నిలవాలని కోరటంతో అధికారులతో మాట్లాడేందుకు ఆమె అక్కడకు వెళ్లారు. అంతవరకూ బాగానే ఉన్నా ఇక్కడే సీన్ రివర్స్ అయ్యింది. మురికివాడకు వెళ్లిన ఆమె.. అక్కడి అధికారులతో మాట్లాడుతున్నారు.

అక్కడి డ్రైనేజీ మీద వేసిన స్లాబ్ మీద నిలుచొని మాట్లాడుతున్న సమయంలో.. ఆమె నిలుచున్న స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవటంతో ఆమె అందులో పడిపోయారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు కూడా డ్రైనేజీలో పడిపోయారు. దాదాపు పది అడుగుల లోతున్న డ్రైనేజీలో పడిపోవటంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమె పడిన వెంటనే.. అక్కడున్న వారంతా వెంటనే స్పందించి.. ఆమెను పైకి లేపి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. పరామర్శకు వెళ్లిన ఎంపీకి.. ఇప్పుడందరూ పరామర్శకు కోసం ఆసుపత్రికి వెళ్లాల్సిన దుస్థితి.