Begin typing your search above and press return to search.

బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి బోరుమన్న వైనం

By:  Tupaki Desk   |   3 April 2021 4:00 PM IST
బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి బోరుమన్న వైనం
X
అరుదైన సన్నివేశం సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకుంది. పోటాపోటీగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎవరికి వారు.. తమ శక్తియుక్తుల్ని సమీకరించుకొని మరీ పోరాడుతున్నారు. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి ధైర్యంగా.. ఆత్మవిశ్వాసంతో ఉండటమే కాదు.. తమ వారిని ఉత్సాహపరుస్తూ ముందుకెళుతుంటారు. అందుకు భిన్నంగా వ్యవహరించారు సాగర్ బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి పానుగోతు రవికుమార్.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన త్రిపురారం మండలం పరిధిలోని తన సొంతూరు పలుగుతండాలో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ బంధువుల వద్ద ప్రచారాన్ని నిర్వహించిన రవి..ఒక్కసారిగా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు. తన భార్యను గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని గుర్తు చేశారు.

తాజాగా బీజేపీ అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇచ్చిందని.. తనను గెలిపించాలని కోరారు. తనకు భయంగా ఉందని.. మీరంతా అండగా ఉండాలంటూ బంధువుల ఎదుట భోరున విలపించారు. చిత్ర విచిత్రాలకు ఎన్నికల ప్రచారం జరిగినా.. ఏ అభ్యర్థి వ్యవహరించని సిత్రమైన రీతిలో రవికుమార్ తీరు ఉందని అంటున్నారు. భావోద్వేగంతో భోరుమన్న ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.