Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ కు మూడిందా? త్వరలోనే అఫ్గనిస్తాన్‌లో కలిసిపోనుందా?

By:  Tupaki Desk   |   14 Aug 2021 4:32 AM GMT
పాకిస్థాన్ కు మూడిందా? త్వరలోనే అఫ్గనిస్తాన్‌లో కలిసిపోనుందా?
X
బీజేపీ రాజ్యసభ సభ్యుడు.. మేధావిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నేత సుబ్రమణ్య స్వామి. ఆయన నోటి నుంచి వచ్చే వ్యాఖ్యలు.. తీసుకునే నిర్ణయాలు.. వేసే అడుగులు మిగిలిన వారికి భిన్నంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఏదైనా విషయం మీద ఆయన మాట్లాడారంటే అందులో ఏదో ఒక లెక్క కచ్ఛితంగా ఉంటుందని చెప్పాలి. తాజాగా ఆయన సంచలన వ్యాఖ్య చేశారు. త్వరలోనే దాయాది పాకిస్థాన్ అఫ్గనిస్తాన్‌లో కలిసి పోతుందన్నారు.

ఇటీవల కాలంలో అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికాతో పాటు మిత్రదేశాలు తమ సైనిక బలగాల్ని ఉపసంహరించుకోవటంతో తాలిబన్లు చెలరేగిపోతున్నారు. దేశంలోని మెజార్టీ భాగం వారి చేతుల్లోకి వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లోని 18 ప్రాంతీయ రాజధానుల మీద పట్టు బిగించినట్లుగా చెబుతున్నారు. మరో వారం వ్యవధిలో దేశాన్ని ఆక్రమించుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా పరిణామాలతో కాబూల్ ను పోలీసులు ఖాళీ చేయగా.. పలువురు ప్రభుత్వాధికారులు తాలిబన్లను లొంగిపోయారు. ప్రజాప్రతినిధులు సైతం తాలిబన్ల వైపు మొగ్గు చూపటం తాజాగా చోటు చేసుకున్న పరిణామంగా చెబుతున్నారు. మరోవైపు అమెరికా తన సేనల్ని ఆ దేశం నుంచి వేగంగా ఉపసంహరించుకుంటోంది. ఆ ప్రభుత్వాన్ని తాము గుర్తించమని చెబుతోంది.

శుక్రవారం దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన కాందహార్ సహా.. హెరత్.. ఖలాత్.. తిరిన్ కోట్.. ఫెరోజ్ కోహ్.. ఖలా ఎ నవ్.. ఘోర్ ప్రొవిన్షియల్ రాజధాని నగరాలను హస్తగతం చేసుకున్నారు. దేశంలోని మొత్తం 407 జిల్లాల్లో 242 తాలిబన్ల వశం కాగా.. మరో 100జిల్లాల్లో భీకర పోరు సాగుతోంది. మరో 65 జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ పట్టు ఉంది. తాలిబన్లతో పోరాటంలో ప్రభుత్వ అధికారులు.. ప్రజాప్రతినిధులు చేతులెత్తుస్తున్నారు. దీంతో.. అఫ్గనిస్తాన్‌ రాజధాని కాబుల్ కు 130 కిలో మీటర్ల దూరంలో తాలిబన్ సేనలు ఉన్నాయి. శుక్రవారం లోగర్ ప్రావిన్స్ లోకి ప్రవేశించటంతో కాబూల్ కు మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరో వారంలో అఫ్గనిస్తాన్‌ మొత్తం తాలిబన్ల వశమవుతుందని అంచనా వేస్తున్నారు.

రానున్న ముప్పును గుర్తించిన కాబూల్ పోలీసులు.. తమ పోలీస్ స్టేషన్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాలిబన్ల నుంచి కీలక ప్రకటన ఒకటి వెలువడింది. అదేమంటే.. తాము కాబూల్ లోని అధ్యక్షభవనాన్ని మాత్రం ముట్టడించబోమని.. అంతర్జాతీయ సమాజాన్ని గౌరవించే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ప్రకటించారు. గత ఏడాది తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మే నుంచి తమ సేనల్ని.. నాటో దళాల్ని ఉపసంహరించుకోవటం తెలిసిందే.

అఫ్ఘానిస్థాన్‌లో హింసతో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రభుత్వాన్ని గుర్తించబోమని భారత్‌, అమెరికా సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. పరోక్షంగా తాలిబన్ల సర్కారును గుర్తించేది లేదని తేల్చిచెప్పాయి.మరోవైపు తాలిబన్లు మాత్రం.. తాము అధికారంలోకి వస్తే అఫ్ఘానిస్థాన్‌లోని ఐఎస్ఐ.. దాష్.. ఆల్ ఖాయిదా లాంటి ఉగ్రమూకలకు చోటు ఇవ్వమని చెబుతున్నారు. తాము మిత్రులమో.. శత్రువులమో తేల్చుకోవాలని భారత్ కు చెబుతుండటం గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో అఫ్ఘానిస్థాన్‌ కు సరిహద్దు దేశమైన పాక్ పై స్వామి సంచలన వ్యాఖ్య చేశారు. త్వరలో ఆ దేశం తాలిబన్ల వశం అవుతుందని పేర్కొన్నారు.

తాజాగా స్వామి చేసిన ట్వీట్ లో త్వరలో తాలిబన్లు పాకిస్థాన్ ను ఆక్రమించుకొని తమ దేశంలో కలిపేసుకుంటారని.. బలూచిస్తాన్.. ఖైబర్ పఖ్తుంఖ్వా.. సింధ్ ప్రావిన్సులను విముక్తి కల్పించి.. సొంత దేశాలుగా ఏర్పాటు చేసుకునే సమయం ఆసన్నమైనట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పాక్.. అమెరికా.. భారత్ సాయం తీసుకోవాలన్నారు. ఆయన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది.