Begin typing your search above and press return to search.

బీజేపీ రూటు మార్చిందా ?

By:  Tupaki Desk   |   30 Jan 2022 4:30 AM GMT
బీజేపీ రూటు మార్చిందా ?
X
లోకల్ అంశాలు, లీడర్ల దెబ్బకు బీజేపీ గోవాలో రూటే మార్చేసింది. దేశంలోని అన్నీ ప్రాంతాల్లో కేవలం హిందుత్వ అజెండా రాజకీయాలే చేసే కమలం పార్టీ గోవాలో మాత్రం క్రైస్తవులకు పెద్ద పీట వేసింది. 40 సీట్లున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో క్రైస్తవులకు ఏకంగా 12 టికెట్లిచ్చింది. ఇంతమందికి బీజేపీ టికెట్లిచ్చిందంటేనే గెలుపు విషయంలో ఎంతగా ఒత్తిడికి గురవుతోందో అర్ధమైపోతోంది.

గోవా ఎన్నికల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి టికెట్ల కేటాయింపులో బాగా ఇబ్బందులు పడుతోంది. మనోహర్ పారిక్కర్ ఉన్నంత వరకు గోవాలో తిరుగులేని నేతగా ఉండేవారు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో పార్టీకి పెద్ద దిక్కు లేకుండాపోయింది. ఇపుడు అధికారంలో ఉన్నది బీజేపీయే అయినా అభ్యర్ధుల ఎంపికలో చాలా ఇబ్బందులు పడుతోంది. దాదాపు ఆరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు రెబల్స్ గట్టి పోటీ ఇస్తున్నారు.

అలాగే మరో ముగ్గురు సీనియర్ నేతలు పార్టీలో నుండి వెళ్ళిపోయి స్వంతంత్రులుగా పోటీచేస్తున్నారు. విచిత్రమేమిటంటే మనోహర్ పారిక్కర్ కొడుక్కు కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ గట్టి అభ్యర్ధులను రంగంలోకి దింపాయి. దాంతో గట్టి అభ్యర్ధుల కోసం బీజేపీ ఇబ్బందులు పడిపోతోంది. ఇందులో భాగంగానే క్రైస్తవులను చేరదీస్తోంది.

గోవా జనాభాలో హిందువులు 66 శాతం ఉన్నారు కాబట్టే బీజేపీ తన హిందుత్వ అజెండాను పక్కన పెట్టేసి క్రైస్తవులకు పెట్టపీట వేసింది. అంటే హిందువుల ఓట్లలో చీలిక వస్తుంది కాబట్టి క్త్రైస్తవుల ఓట్లతో గట్టెక్కాలని బీజేపీ ప్లాన్ చేసింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే 8 శాతం ఉన్న ముస్లింలను బీజేపీ పూర్తిగా పక్కన పెట్టేసింది. బహుశా ముస్లింల ఓట్లు అవసరం లేదనుకుందో లేకపోతే ఎలాగూ వేయరని డిసైడ్ అయిపోయిందేమో. ఆప్ కూడా పోటీ చేస్తున్న దాని పోటీ నామమాత్రమమనే అంటున్నారు. మరి బీజేపీ ప్లాన్ వర్కవుటవుతుందా .