Begin typing your search above and press return to search.

బీజేపీ టార్గెట్ చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే

By:  Tupaki Desk   |   7 Feb 2017 2:57 PM IST
బీజేపీ టార్గెట్ చూస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే
X
కేంద్రంలో అధికారంలో బీజేపీకి ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో మిశ్ర‌మ ఫలితాలు ఎదుర‌య్యే ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌టంతో తెలుగు రాష్ట్రాల‌పై ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ పై క‌న్నేసిన‌ట్లు తెలుస్తోంది. ఏకంగా రాష్ట్రం నుంచి 15మంది పార్లమెంటు సభ్యులు - 20మంది ఎమ్మెల్యేలు లక్ష్యంగా బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పుడు తమ పార్టీ ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ - నర్సాపురంతో పాటు గతంలో గెలుపొందిన రాజమండ్రి - కాకినాడ పార్లమెంటు స్థానాలు కూడా వీరి జాబితాలో ఉన్నాయి. ఇదే సమయంలో ఉత్తరాంధ్ర - రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ తరుపున ఎంపీలను గెలిపించుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నారు. పెరగనున్న శాసనసభ స్థానాల్లో మిత్రపక్ష తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యం ఇచ్చి మెజారిటీ పార్లమెంటు స్థానాలు రాబట్టు కోవాలని పార్టీ నేతలు నిర్ణయించారు. కాదూ కూడదని తెలుగుదేశం పార్టీ పట్టుబడితే సొంతంగా బరిలోకి దిగేందుకు కూడా బీజేపీ శ్రేణులను సిద్ధం చేస్తున్నారు.

ఇందుకు త‌గిన కార‌ణాల‌ను సైతం వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీకీ 30లక్షల సభ్యత్వాలు ఉన్నట్టు పార్టీ నేతలు చెపుతున్నారు. వీరిలో 25వేల మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు. వీరు కాక ఆర్‌ ఎస్‌ ఎస్‌ శ్రేణులు ఎలాగూ ఉన్నాయి. వీరినందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు పూర్తి స్థాయిలో పార్టీకి సేవలు అందించే శ్రేణుల అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పార్టీకి పూర్తి స్థాయి సేవలు అందించేందుకు వేతనాలు చెల్లించి హోల్‌ టైమర్లను నియమించనున్నారు. ఇప్పటికే 8 పార్లమెంటు స్థానాల పరిధిలో వీరి ఎంపిక తుదిదశకు చేరినట్టు చెపుతున్నారు. ఈ ఏడాది ఆఖరిలోగా లక్ష్యంగా పెట్టుకున్న అన్ని పార్లమెంటు స్థానాల్లోను ఈ ప్రక్రియ ముగించాలని నిర్ణయించారు. పార్టీ తరపున ఎన్నికల బరిలో దిగే అభ్యర్థులకు ఆర్థిక వనరులు సమకూర్చడం ఇప్పటి వరకు ఉత్తరాధి రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైంది. దక్షిణాదిలో అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చులు తామే పెట్టుకునే సంప్రదాయం నెలకొంది. ఇది పార్టీ అభ్యర్థుల గెలుపునకు అవరోధంగా ఉందనేది అధిష్టానం ఆలోచనగా చెపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులకు నిధుల పంపిణీ చేయాలని భావిస్తున్నారు. తద్వారా గెలుపు అవకాశం ఉన్నవారు ఆర్థికంగా స్థితిమంతులు కాకపోయినా ఫర్వాలేదని, హోల్‌టైమర్లుగా నియమితులయ్యే వారు దీనిని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించాలని దిశా నిర్థేశం చేయనున్నారు.

అదే స‌మ‌యంలో బీజేపీ నేతలు ప్రభుత్వంలో భాగస్వామ్యం వహిస్తున్నప్పటికీ నామినేటెడ్‌ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై బీజేపీ శ్రేణులు ఆగ్రహంగా ఉన్నాయి. పైగా రాష్ట్ర నాయకత్వం దీనిపై ఉదాసీనత చూపడం కూడా బీజేపీ శ్రేణులకు మింగుడుపడటం లేదు. బీజేపీ నేతల్లోని అసంతృప్తి, ఆగ్రహాన్ని బీజేపీ అధిష్టానం గుర్తించినట్టు చెపుతున్నారు. వీరిలోని ఆగ్రహాన్ని పోగొట్టేందుకు తొలివిడతలో 20 మంది నేతలకు కేంద్రస్థాయి నామినేటెడ్‌ పదవులు కట్టబెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. రాష్ట్ర కార్యవర్గంలోని ఆఫీసు బేరర్లకు తొలి ఛాన్స్‌ ఇవ్వనున్నారు. ఇప్పటికే వీరికి సంబంధించిన జాబితా సిద్ధమైందని స‌మాచారం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/