Begin typing your search above and press return to search.

గురి పెట్టిన గులాబీకి.. పొగడ్తతో మరింత బలాన్నిచ్చిన కమలం

By:  Tupaki Desk   |   29 Jan 2022 5:38 AM GMT
గురి పెట్టిన గులాబీకి.. పొగడ్తతో మరింత బలాన్నిచ్చిన కమలం
X
ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం అందరికి సాధ్యమయ్యేది మాత్రమే కాదు. పాజిటివ్ ను తీసుకుంటాం కానీ నెగిటివ్ ను అస్సలు భరించలేమన్నట్లుగా కొందరి తీరు ఉంటుంది. కేంద్రం అంటే పెద్దన్నలా వ్యవహరించాలి. తప్పును తప్పుగా చూపించాలి. ఒప్పును ఒప్పుగా ఒప్పుకోవాలి. ఆ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారును వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏ విషయంలో అయినా రాష్ట్రాలు స్ఫూర్తివంతంగా వ్యవహరిస్తే.. ఆ విషయాన్నిప్రస్తావించి ప్రశంసలు కురిపించే విషయంలో వారు వెనక్కి తగ్గటం లాంటిది అస్సలు కనిపించదు. అయితే.. ఈ లక్షణం తెలంగాణ అధికారపక్షానికి ఒకవరంగా మారటమే కాదు.. తమ రాజకీయ వ్యూహంలో భాగంగా.. పొగిడిన పార్టీని ఇరుకున పడేసే ఆస్త్రంగా వారి పొగడ్తను తీసుకుంటోంది.

గడిచిన కొద్దికాలంగా బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ ఎంతలా రాజుకుందో తెలియంది కాదు. ఈ సందర్భంగా తమను పలు సందర్భాల్లో పొగిడిన వైనాల్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కమలం పార్టీపైకి పోరు చేస్తోంది. దీంతో.. గులాబీ పార్టీ తప్పుల్ని ఎత్తి చూపే తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు మహా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే.. సంబంధాలు బాగుంటే పొగడటం.. బాగోలేకపోతే మండిపడటం మాత్రమే అలవాటునన టీఆర్ఎస్ పార్టీ తీరు కమలనాథలుకు కొత్త కష్టంగా మారింది.

తెలంగాణ అధికార పార్టీతో రాజకీయ పోరు ప్రధానంగా బీజేపీతోనే ఉందన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకోవటం తెలిసిందే. ఇలాంటి వేళ.. డైలీ బేసిస్ లో మోడీ సర్కారుపై టీఆర్ఎస్ నేతలు విరుచుకుపడుతున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు బేషుగ్గా ఉన్నాయంటూ పొగిడేస్తున్న వైనం గులాబీ పార్టీకి సరికొత్త ఆయుధంగా మారుతోంది. మీ జాతీయ పార్టీ నేతలే మా సర్కారు పని తీరును మెచ్చుకుంటున్నారంటూ ప్రశ్నిస్తున్న గులాబీ నేతల మాటలకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్న దుస్థితి.

తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వేకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ప్రశంచింటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ అనుసరిస్తున్న పద్దతిని మంచి వ్యూహంగా అభినందిస్తూ.. ఇదే విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అనుసరించేందుకు చర్యలు తీసుకుంటామన్న మాట.. తెలంగాణ రాష్ట్ర పాలకులకు సరికొత్త ఆస్త్రంగా మారింది.

రెండో వేవ్ వేళ.. కరోనా కట్టడి కోసం దేశంలోనే తొలిసారి తెలంగాణ రాష్ట్రం జ్వర సర్వేను నిర్వహించి మంచి ఫలితాల్ని సాధించిందన్న మంత్రి హరీశ్ రావు.. తాజాగా మళ్లీ జ్వర సర్వేను నిర్వహిస్తున్న వైనాన్ని వెల్లడించారు. దీనికి కేంద్ర మంత్రి అభినందిస్తూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ - బీజేపీల నడుమ అధిపత్య పోరు తీవ్రంగా సాగుతున్న వేళ.. కేంద్రం నుంచి అనూహ్యంగా వచ్చిన ప్రశంసల్ని హరీశ్ అండ్ కో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో తలమునకలై ఉన్నారు.

ఈ ప్రశంసల్ని ప్రస్తావిస్తూ హరీశ్ అండ్ కో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకత్వంపై గురి పెడుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు పోరు జరుగుతున్న వేళ.. ఇలాంటి ప్రశంసలు తమకు కొత్త తిప్పలు తెచ్చి పెడతాయని వాపోతున్నారు. ఏమైనా తమను గురి పెట్టిన గులాబీ పార్టీకి తమ ఢిల్లీ నేతలు చేస్తున్న కాంప్లిమెంట్లు తమ పాలిట మందుగుండుగా మారి.. దెబ్బ తీస్తున్నాయన్న ఆవేదనను టీబీజేపీ నేతలు వ్యక్తం చేయటం గమనార్హం.