Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ బాటలోనే బీజేపీ

By:  Tupaki Desk   |   27 Feb 2016 12:06 PM IST
కాంగ్రెస్ బాటలోనే బీజేపీ
X
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా - రాహుల్ గాంధీతో పాటు ఇతరులను కోర్టుకు లాగిన బీజేపీ నేత సుబ్రమణ్యస్వామికి కొత్త చిక్కు వచ్చిపడింది. కాంగ్రెస్ బాటలోనే బీజేపీ కూడా నడవడంతో ఆయన ఇరకాటంలో పడ్డారు. యంగ్ ఇండియా ఛారిటీ సంస్ధ ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రికను టేకోవర్ చేస్తూ దానికి రుణం ఇవ్వడంపై ఆయన కేసు వేసి సోనియాను కోర్టుకీడ్చిన సంగతి తెలిసిందే.

నేషనల్ హెరాల్డ్ కు కాంగ్రెస్ పార్టీ రూ.90.25 కోట్లను రుణంగా ఇచ్చింది. ఒక రాజకీయ పార్టీ ఇలా ఓ వాణిజ్య సంస్ధకు రుణం ఇవ్వొచ్చా అన్నది ఇపుడు కోర్టులో నలుగుతున్న సమస్య. కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ - రాహుల్ కలసి నేషనల్ హెరాల్డ్ రూ.50 లక్షలకే పొందారని అంటూనే కంపెనీలకు రాజకీయ పార్టీ రుణం ఇవ్వడం చట్ట రీత్యా నేరమని సుబ్రమణ్యస్వామి వాదన.

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుపై చర్చోపచర్చలు సాగుతుండగానే బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలోనే నడక ప్రారంభించింది. ముంబయిలో తరుణ్ భారత్ అనే పత్రికకు రూ.25 లక్షలు రుణంగా ఇచ్చింది. ఈ పత్రికను శ్రీ మల్టీ మీడియా విజన్ లిమిటెడ్ నడుపుతోంది. చిత్రమేమిటంటే ఈ కంపెనీ వ్యవస్ధాపకుల్లో ప్రస్తుత కేంద్ర మంత్రి నితన్ గడ్కరీ కూడా ఉన్నారు. ఇటు పత్రికలోనూ, కంపెనీలోనూ కీలక పాత్ర పోషించారు. 2001లో బీజేపీ మహరాష్ట్ర శాఖ శ్రీ మల్టీమీడియా విజన్ లిమిటెడ్ కు రూ.25 లక్షలు ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ రుణం పై ఎలాంటి వడ్డీ రాలేదు. పైగా ఆ కంపెనీ సాధారణ కంపెనీ. అంటే సోనియా - రాహుల్ నెలకొల్పిన ఛారిటీ కంపెనీ కాదు. లాభాల కోసం నడిపే కంపెనీకి బీజేపీ ఎలా రుణం ఇచ్చిందనే ప్రశ్న ఇపుడు వస్తోంది. మరి బీజేపీ ఈ విషయంలో చేసింది కరక్టయితే.. మరి కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ హెరాల్డ్ రుణం ఇవ్వడంలో తప్పేముందన్న వాదన వినిపిస్తోంది. దీనిపై సుబ్రమణ్యస్వామి - బీజేపీ వర్గాలుఎలా స్సందిస్తాయో చూడాలి?