Begin typing your search above and press return to search.

హోదాపై బీజేపీ టాక్ మారింది!

By:  Tupaki Desk   |   19 Aug 2016 5:14 PM IST
హోదాపై బీజేపీ టాక్ మారింది!
X
ఏపీ విష‌యంలో కేంద్ర బీజేపీ మ‌రోసారి టాక్ మార్చేసిందా? హోదాపై చేస్తున్న ఆందోళ‌న‌ల‌ను ఏమ‌త్ర‌మూ ప‌ట్టించుకోవ‌డం లేదా? ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త వివాదంతో పొద్దుపుచ్చుతోందా? అంటే ఔన‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ సీనియ‌ర్ నేత ఒక‌రు శుక్రవారం చేసిన వ్యాఖ్య‌లు పెద్ద చిచ్చుకే దారితీశాయి. ఉమ్మ‌డి రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో రాజ‌ధాని లేని రాష్ట్రంగా ఏపీ అవ‌త‌రించింది. దీనికితోడు ఆర్థిక‌లోటు రాష్ట్రాన్ని ప‌ట్టిపీడిస్తోంది. పోల‌వరం వంటి బ‌హుళార్ధ‌సాధ‌క ప్రాజెక్టులూ నిర్మించాల్సి ఉంది. దీంతో ఏపీకి కేంద్రం నుంచి అన్ని విధాలా సాయం అవ‌స‌రం. ముఖ్యంగా విభ‌జ‌న స‌మ‌యంలో చేసిన చ‌ట్టంలో ఏపీకి రావాల్సిన నిధులు - ప్రాజెక్టుల‌ను కేంద్రం ఖ‌చ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది.

ఇదికాకుండా అప్ప‌ట్లో ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ రాజ్య‌స‌భ సాక్షిగా చేసిన ఏపీకి ప్ర‌త్యేక హోదా కూడా ఇవ్వాల్సి ఉంది. గ‌త కొన్నాళ్లుగా ఇవే అంశాల‌పై ఇటు ఏపీలోనూ - అటు కేంద్రంలోనూ వివాదం మొద‌లైంది. ఏపీ విప‌క్షాలు రాష్ట్ర బంద్‌ కే పిలుపునిచ్చాయి. వైసీపీ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదాతోపాటు ప్యాకేజీ కూడా ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. టీడీపీ అధినేత - ఏపీసీఎం చంద్ర‌బాబు కూడా ఈ రెండు ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఇప్పుడు తాజాగా బీజేపీ ఏపీ వ్యవహారాలకు సంబంధించి ఢిల్లీలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నేత హరినాథ్ బాబు ఓ తెలుగు టీవీ ఛానెల్ లైవ్ డిబేట్ లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీ హోదాపై ఆయ‌న మాట్టాడుతూ.. ప్ర‌త్యేక హోదా లేదా ప్యాకేజీ ఏదో ఒక‌టి ఖాయంగా ఇస్తామ‌ని చెప్పారు.

అందేంటి రెండూ ఇవ్వ‌రా అంటే.. ఎలా ఇస్తార‌ని ఆయ‌న ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే బోలెడ‌న్ని నిధుల‌ను ఏపీకి ఇచ్చామ‌ని ఆయ‌న చెప్పారు. ఏపీకి ఏమివ్వాల‌నే విష‌యంపై కేంద్రంలో అందిరితోనూ చ‌ర్చిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే ఈ విష‌యం మీడియాకు వెల్ల‌డ‌వుతుంద‌ని ఆయ‌న అన్నారు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా లేదంటే ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పుడు ఇదే విష‌యం ఏపీలో ప్ర‌త్యేక టాపిక్ అయిపోయింది. అదేంటి రెండూ ఇవ్వ‌కపోతే ఎలా అని అంద‌రూ ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి దీనిపై చంద్ర‌బాబు - విప‌క్ష‌నేత జ‌గ‌న్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా ఏపీ విష‌యంలో కేంద్రం వేస్తున్న పిల్లి మొగ్గలు మాత్రం పీక్ స్టేజ్‌ కి చేరిపోయాయి !