Begin typing your search above and press return to search.

తన కొడుక్కి తండ్రి ఎవరో చెప్పేసిన నటి కమ్ ఎంపీ

By:  Tupaki Desk   |   17 Sep 2021 1:30 AM GMT
తన కొడుక్కి తండ్రి ఎవరో చెప్పేసిన నటి కమ్ ఎంపీ
X
లోక్ సభలోని ఎంపీల్లో భిన్నంగా.. తరచూ విచిత్రమైన వార్తల్లో నిలిచే నాయకురాలు కమ్ నటిగా నుస్రత్ జహాన్ ను చెప్పాలి. బెంగాల్ అధికార పార్టీ అయిన అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) లోక్ సభ సభ్యురాలిగా వ్యహరిస్తున్న ఈ నటి ఈ మధ్యనే పండంటి బిడ్డకు జన్మనివ్వటం తెలిసిందే. భర్తతో వేరుగా ఉన్న ఆమె గర్భం దాల్చటం.. ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న విషయాన్ని ఆమె బయటపెట్టకపోవటం ఇదో సస్పెన్స్ గా మారటమే కాదు.. పలువురు పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావించటం.. ఆమె ఘాటుగా రియాక్టు కావటం తెలిసిందే.

బెంగాలీ నటిగా సుపరిచితురాలైన ఆమె.. తాజాగా తన బిడ్డకు తండ్రిఎవరన్న విషయాన్ని ఆమె చెప్పేశారు. పిల్లాడి జన్మ ధ్రువ పత్రంపై ఆమె తండ్రి పేరును ప్రకటించటం ద్వారా ఇప్పటిదాకా సీక్రెట్ గా ఉన్న విషయం రివీల్ అయిపోయింది. తన బిడ్డకు తండ్రి నటుడు కమ్ రాజకీయ నేత యష్ దాస్ గుప్తాగా ఆమె పేర్కొన్నారు. అయితే.. అదే పేరు ఆమె వెల్లడిస్తారన్న అంచనాలకు తగ్గట్లే.. ఆమె పేరు వెల్లడించటం గమనార్హం.

స్టార్ హోదాను అనుభవిస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేయటం.. అనూహ్యంగా గెలవటం విశేషంగా చెప్పాలి. ఇదిలా ఉండగా.. తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్ ను టర్కీలో ఆమె పెళ్లాడారు. అంతా సాఫీగా సాగుతుందనుకున్న వేళ.. నుస్రత్ ప్రెగ్నెంట్ అని.. ఆమె బిడ్డతో తనకు సంబంధం లేదని నిఖిల్ జైన్ ప్రకటించటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే.. నిఖిల్ జైన్ తో టర్కీలో తనకు జరిగిన వివాహం భారత చట్టాల ప్రకారం చెల్లదని ఆమె ప్రకటించారు. అతనితోతనకు సంబంధం లేదని.. తన డబ్బులన్ని అతడే తీసుకున్నట్లుగా ఆమె ఆరోపించారు. పెళ్లి చెల్లదని తేల్చేసిన వేళ.. విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ప్రెగ్నెన్సీకి కారణం ఎవరన్న విషయాన్ని ఆమె వెల్లడించలేదు. గత ఏడాది లాక్ డౌన్ వేళలో ఒక సినిమా షూటింగ్ సమయంలో నటుడు యష్ దాస్ గుప్తా ప్రేమలో పడినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే.. యష్ దాస్ గుప్తాకు అప్పటికే పెళ్లై.. పదేళ్ల కొడుకు ఉన్నాడు. అందుకే వీరిద్దరూ పెళ్లి చేసుకునే విషయం కానీ.. మరే విషయాన్ని వెల్లడించలేదంటున్నారు. తాజాగా అతగాడు విడాకులు తీసుకోవటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ కు అసలు ట్విస్టు ఏమంటే.. టీఎంసీ ఎంపీ నస్రత్ బిడ్డకు తండ్రిగా పేర్కొన్న యష్ దాస్ గుప్తా బీజేపీ నేత కావటం. వాస్తవానికి టీఎంసీకి.. బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటి రెండు భిన్న ధ్రువాలైన పార్టీలకు చెందిన నేతల మధ్య ప్రేమ పుట్టటం.. అదికాస్తా మరింత దూరానికి వెళ్లటం విశేషమే. రానున్న రోజుల్లో మరేం జరుగుతుందో చూడాలి.