Begin typing your search above and press return to search.

టీడీపీ కి గొట్టిపాటి గుడ్ బైనా.?

By:  Tupaki Desk   |   25 Nov 2019 11:17 AM GMT
టీడీపీ కి గొట్టిపాటి గుడ్ బైనా.?
X
తెలుగు దేశానికి మరో షాక్ తగలడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. ఆ ఉపద్రవం నుంచి కోలుకోక ముందే మరో షాక్ తగిలేలా పరిస్థితి కనిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలోని అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమన్న ప్రచారం మొదలైంది. తెలుగుదేశం పార్టీలో తనకు భవిష్యత్తు లేదని.. పార్టీ మారాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి గొట్టిపాటి సైలెంట్ గా ఉంటున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో పలు క్వారీలపై వైసీపీ సర్కారు దాడులు చేయిస్తోంది. ఇందులో భాగంగానే గొట్టిపాటి క్వారీలపై కూడా దాడులు జరుగుతున్నట్టు తెలిసింది. దీంతో ఈ దాడులు అరికట్టాలంటే ఆర్థికంగా నిలబడాలంటే రాజకీయంగా వైసీపీ లోనే ఉంటేనే బెటర్ అని.. టీడీపీ లో భవిష్యత్తు లేదని డిసైడ్ అయినట్లు సమాచారం.

ప్రకాశం జిల్లా లో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలపడాలని చూస్తున్న వైసీపీ ఈ మేరకు గొట్టిపాటి ని వైసీపీ లో చేర్చుకోవడానికి పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ప్రకాశం జిల్లాలో మెజార్టీగా ఉన్న సామాజికవర్గానికి చెందిన గొట్టిపాటిని లాగేస్తే స్థానికసంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం నల్లేరు పై నడకేనని వైసీపీ పెద్దలు స్కెచ్ గీసినట్లు తెలిసింది.

తాజాగా హైదరాబాద్ లో జరిగిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి మనవడి బర్త్ డే వేడుకల్లో గొట్టిపాటి పాల్గొనడం సంచలనమైంది. ఈయనతో మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని కూడా చర్చలు జరిపినట్టు తెలిసింది. 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గొట్టిపాటి తర్వాత టీడీపీలో చేరారు. ఇప్పుడు మాతృ పార్టీలోకి చేరడానికి యోచిస్తున్నట్టు తెలిసింది. వైసీపీ లోకి రావాలని గొట్టిపాటి ని ముగ్గురు మంత్రులు బాలినేని, కొడాలి నాని, పేర్ని నాని కోరినట్లు తెలిసింది. మంత్రి బాలినేనికి బాగా దగ్గరైన గొట్టిపాటి ఆయన కోరిక మేరకు వైసీపీ లో రావాలా వద్దా అని పునరాలోచనలో పడిపోయినట్లు తెలిసింది.