Begin typing your search above and press return to search.

భూపాలపల్లి కలెక్టర్ పై బదిలీ వేటు.. స్వీట్లు పంచి మరీ సంబరాలు ఎందుకు?

By:  Tupaki Desk   |   9 Nov 2020 12:45 PM IST
భూపాలపల్లి కలెక్టర్ పై బదిలీ వేటు.. స్వీట్లు పంచి మరీ సంబరాలు ఎందుకు?
X
తీవ్ర ఆరోపణలు.. విమర్శలు ఎదుర్కొంటున్న భూపాలపల్లి కలెక్టర్ అబ్దుల్ అజీజ్ ఎట్టకేలకు బదిలీ వేటు పడింది. కరోనా వేళ.. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం భారీగా జరిగిందని.. కాంట్రాక్టర్లకు అప్పనంగా పనులు అప్పగించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిధుల గోల్ మాల్ తో పాటు.. ఆయన తీరుతో రాజకీయ పార్టీ నేతలు పలువురు విసిగిపోయినట్లుగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆయనపై స్థానిక మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు పబ్లిష్ అయ్యాయి. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ఆయన తీరుపై కన్నేసింది. తాజాగా జరిగిన ఐఏఎస్ బదిలీల్లో అజీమ్ పై బదిలీ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచేశారు.
ఆయన స్థానంలో ములుగు జిల్లా కలెక్టర్ క్రిష్ణ ఆదిత్యకు బాధ్యతలు అప్పగించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తమ కలెక్టర్ పై బదిలీ వేటు పడిందని.. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వలేదన్న సమాచారం అందటంతో భూపాలపల్లి జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలతో సహా.. పలువురు వీదుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు.

ఆదివారం రాత్రి అయితే.. భూపాలపల్లి టౌన్ లో టపాసులు కాల్చి.. కలెక్టర్ బదిలీపై తమ ఆనందాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇంతలా ఒక కలెక్టర్ తీరుపై వ్యతిరేకత రావటం ఇటీవల కాలంలో ఇదేనన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఆరోపణల తీవ్రత మరింత పెరగకముందే..తెలంగాణ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నారన్న మాట వినిపిస్తోంది.