Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్టు భూములు ఎగిరిపోతున్నాయా..?

By:  Tupaki Desk   |   16 Feb 2022 2:30 AM GMT
ఎయిర్ పోర్టు భూములు ఎగిరిపోతున్నాయా..?
X
ప్రజోపయోగం కోసం ప్రాజెక్టుల  పేరు మీద భూములను వేలాదిగా సేకరిస్తారు. ఆ మీదట వాటిలో ఎంత వినియోగిస్తారో తెలియదు. ఇక మరో వైపు ఈ భూములలో రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చేయడమూ పరిపాటిగా మారింది. అభివృద్ధి కోసం భూసేకరణ చేయడం, ఆ మీదట వాటిని కొందరు కబ్జాలు చేసినా పట్టించుకోకపోవడం జరుగుతూ వస్తోంది.

ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా భోగాపురం లో ఇంటర్నెషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో దాదాపుగా మూడు వేల ఎకరాల భూములను సేకరించారు. ఇక జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వేల ఎకరాలు అవసరం లేదని అయిదు వందల ఎకరాలను తగ్గించి మరీ దాని టెండర్లను జీఎమ్మార్ సంస్థకు అప్పగించింది.

అంటే అలా మిగిలిన అయిదు వందల ఎకరాలను భవిష్యత్తు అవసరలకు వాడుకోవాలని వైసీపీ సర్కార్ ఆలోచన చేసింది. ఒక విధంగా అది మంచిదే అని అంతా భావించారు. పైగా పూర్తి భూమిని  కేటాయించకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చెందేలా ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు అని కూడా భావించారు.

అయితే ఎయిర్ పోర్టు నిర్మాణం పనులు ఇంకా మొదలు కాలేదు కానీ ఇలా మిగులు భూములుగా ఉన్న అయిదు వందల ఎకరాల మీద పెద్ద గద్దల కన్ను పడింది అని అంటున్నారు.

వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే ఈ భూములను కబ్జా చేయడానికి కొందరు పెద్దలు చూస్తున్నారు అని విజయనగరం జిల్లా మాజీ, టీడీపీ సీనియర్ నేత పతివాడ నారాయణ‌స్వామి ఆరోపిస్తున్నారు. ఈ భూములకు రెక్కలు రాకుండా కాపాడాలని ఆయన జిల్లా కలెక్టర్ ని తాజాగా కలసి వినతిపత్రం సమర్పించారు.

మరి ఆ పెద్దలు ఎవరో, గద్దలు ఎవరో పతివాడ పేర్లను అయితే  వివరించలేదు కానీ అధికార బలం అంటున్నారు, పలుకుబడి కలిగిన వారు అంటున్నారు. మరి దాన్ని బట్టి చూస్తే ఇక్కడ రైతులు కారు చౌకగా ఇచ్చిన భూములు పెద్దల పాలు అవుతూంటే చోద్యం చూడడం మాత్రం అధికారులకు తగని పని.

వీలైతే ఆయా గుర్తించిన భూములకు రక్షణ కల్పించాలని, రేపటి రోజున అభివృద్ధి కోసం ల్యాండ్ బ్యాంక్ గా మార్చుకుని రికార్డులు మొత్తం నమోదు చేసి భద్రంగా ఉంచాలని అంతా కోరుతున్నారు.  

మొత్తానికి చూస్తే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరానికి మించి నాడు భూములు సేకరించి వాటిని తాము స్వాధీనం చేసుకోవడానికి టీడీపీ పెద్దలు స్కెచ్ గీశారని గతంలో వైసీపీ నాయకులు ఆరోపించేవారు, ఇపుడు చూస్తే ఈ భూములు వైసీపీ వారి కబ్జాకు గురి అవుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇలా ప్రభుత్వం కోసం, ప్రజల ప్రయోజనాల  కోసం, భావి ప్రగతి కోసం భూములు ఇచ్చిన వారు నోరు లేక అలా చూస్తూ  ఊరుకుంటే అలా అప్పనంగా వచ్చిన భూములను చప్పరించాలని ఎవరు చూసినా అది క్షమార్హం కానే కాదు.

ఈ విషయంలో కూడా సరైన చర్యలు తీసుకునేల భూ సేకరణ చట్టంలో మార్పులు తీసుకువస్తే బాగుంటుంది అని మేధావులు సూచిస్తున్నారు.