Begin typing your search above and press return to search.

భీమిలీ హాట్ సీట్...కర్చీఫ్ వేసేస్తున్నారు...?

By:  Tupaki Desk   |   21 April 2022 2:36 PM GMT
భీమిలీ హాట్ సీట్...కర్చీఫ్ వేసేస్తున్నారు...?
X
విశాఖ జిల్లాలో భీమిలీకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ సీటు ఎపుడూ హాట్ సీట్ గానే రాజకీయ నేతలు చూస్తారు. సాగరతీరానికి అభిముఖంగా అటు పల్లె, ఇటు పట్టణ వాతావరణాన్ని సంతరించుకున్న భీమిలీ నియోజకవర్గ కేంద్రంలో ఎపుడూ రాజకీయం ఆసక్తికరంగానే ఉంటుంది.

ఇప్పటికి మూడు దశాబ్దాల క్రితం 1994లో ఎన్టీయార్ భీమిలీ నుంచి పోటీ చేసేందుకు మోజు పడ్డారు. అయితే చివరి నిముషంలో ఆయన ల్యాండ్ అయింది శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో. అలా ఉత్తరాంధ్రా ఊసు వచ్చినపుడల్లా భీమిలీ సీన్ లోకి వస్తుంది. ఇక లేటెస్ట్ గా చూసుకుంటే 2019 ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీకి లోకేష్ బాబు రెడీ అయ్యారు. ఆ తరువాత ఆయన మనసు మార్చుకుని మంగళగిరికి వెళ్ళిపోయారు.

మరో రెండేళ్ళల్లో ఎన్నికలు రానున్నాయి. దాంతో భీమిలీ మళ్ళీ చర్చకు వస్తోంది. ముఖ్యంగా టీడీపీలో భీమిలీ నుంచి ఎవరు పోటీకి దిగుతారు అన్నది పెద్ద చర్చగా ఉంది. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జిగా ఉన్న కోరాడ రాజబాబు తనకే టికెట్ కన్ ఫర్మ్ అనుకుంటున్నారు. ఆయన గతంలో మండల పరిషత్ చైర్మన్ గా పనిచేశారు. బలమైన సామాజికవర్గానికి చెందిన నాయకుడు, అర్ధబలం కూడా ఉండడం ప్లస్ పాయింట్స్.

అయితే ఆయన మీద ఈ మధ్య పార్టీ నాయకులు అధినాయకత్వానికి వెల్లువలా ఫిర్యాదు చేస్తున్నారు. కోరాడను ఇంచార్జి పదవి నుంచి తప్పించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు. అయితే ఈ రకమైన ఫిర్యాదుల వెనక రాజకీయం ఉందని కోరాడ వర్గీయులు అనుమానిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో బిగ్ షాట్ ఒకరు భీమిలీ నుంచి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారని, అందులో భాగమే కోరాడను తప్పించమని వెళ్తున్న ఫిర్యాదులు అంటున్నారు. భీమిలీ చిన్న సీటు కాదు, గత ఎన్నికల ముందు టీడీపీలో ఇద్దరు బడా నాయకుల మధ్య చిచ్చు రేపిన సీటు అది. దాంతో భీమిలీ సీటు హాట్ ఫేవరేట్ గా మళ్లీ కనిపిస్తోంది.

ఇక ఈ సీటు మీద మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు భరత్ కన్ను కూడా ఉంది అంటున్నారు. ఆయనకు మొదటి ప్రయారిటీ విశాఖ లోక్ సభ సీటు అయినా చివరి నుముషంలో కనుక అక్కడ నో అంటే భీమిలీ నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగాల్సి ఉంటుంది అని అంటున్నారు. ఆయన కూడా భీమిలీ నేతలతో టచ్ లో ఉంటున్నారు.

అదే విధంగా గంటా శ్రీనివాసరావు వచ్చే ఎన్నికల్లో భీమిలీ నుంచి పోటీకి దిగాలని చూస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఆయన 2014లో ఇక్కడ నుంచి గెలిచిన తరువాతనే అయిదేళ్ళు మంత్రిగా ఉన్నారు. ఆ సెంటిమెంట్ తో భీమిలీ మీద మోజు పెంచుకుంటున్నారు.

ఇక టీడీపీలో చూస్తే చాలా మంది నియోజకవర్గం నేతల కన్ను ఉంది. 2004లో కాంగ్రెస్ నుంచి భీమిలీ ఎమ్మెల్యేగా గెలిచిన కర్రి సీతారాం మరో మారు చాన్స్ ఇస్తే పోటీకి రెడీ అంటున్నారు. ఇలా చాంతాడంత లిస్ట్ టీడీపీలో ఉంది. దాంతో ఇప్పటి నుంచే పోటీ కూడా పెరిగిపోతోంది. మొత్తానికి ఈసారి టీడీపీ ఏపీలో ఫస్ట్ గెలిచే సీటు భీమిలీయే అన్న మాట కూడా ఉండడంతో రేసులో సైకిల్ నేతలు చాలా మందే క్యూ కడుతున్నారు. అదే విధంగా పొత్తులో భాగంగా జనసేన ఈ సీటుని కోరడం గ్యారంటీ అంటున్నారు. ఆ పార్టీ నుంచి కూడా ముఖ్య నాయకుల కన్ను భీమిలీ మీద ఉంది.