Begin typing your search above and press return to search.

శేరిలింగంపల్లిలో ఆనంద్ ప్రసాద్‌ పై చెప్పులతో దాడి!

By:  Tupaki Desk   |   4 Nov 2018 9:18 AM GMT
శేరిలింగంపల్లిలో ఆనంద్ ప్రసాద్‌ పై చెప్పులతో దాడి!
X
మహా కూట‌మిలో సీట్ల పంప‌కం ఇంకా పూర్తి కానే లేదు. ఆ స్థానం ఏ పార్టీకి ద‌క్కుతుందో తేల‌నే లేదు. టీడీపీలో మాత్రం అక్క‌డ అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. ఓ ఆశావ‌హుడి మ‌ద్ద‌తుదారులు మ‌రో ఆశావ‌హుడిపై చెప్పుల‌తో దాడి చేశారు. హైద‌రాబాద్ శివార్ల‌లోని శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఆదివారం చోటుచేసుకున్న ఈ దాడి తాజాగా క‌ల‌క‌లం సృష్టించింది.

సీమాంధ్రులు ఎక్కువ‌గా ఉండ‌టంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో టీడీపీకి ఇప్ప‌టికీ గ‌ట్టి ప‌ట్టు ఉంది. అందుకే మ‌హా కూట‌మి పొత్తుల్లో భాగంగా శేరిలింగంప‌ల్లిని త‌మ‌కే కేటాయించాల‌ని ఆ పార్టీ నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఆ సీటు ద‌క్క‌డం దాదాపు ఖాయ‌మే. అయితే, ఇక్క‌డ టీడీపీ త‌ర‌ఫున ఇద్ద‌రు ప్ర‌ధాన నేత‌లున్నారు. వారిలో ఒక‌రు భవ్య క్రియేషన్స్ అధినేత - ప్రముఖ పారిశ్రామికవేత్త వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్. మ‌రొక‌రు మొవ్వ స‌త్య నారాయ‌ణ‌. ఇద్ద‌రూ టికెట్ త‌మ‌దేన‌నే ధీమాతో ఉన్నారు.

ఆనంద్ ప్ర‌సాద్‌కు బాల‌కృష్ణ అండ ఉంది. టికెట్‌ను ఆయ‌న‌కే కేటాయించాల‌ని చంద్ర‌బాబునాయుడికి బాల‌య్య సిఫార్సు చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో టికెట్ ఖాయ‌మ‌ని ఆనంద్ ప్ర‌సాద్ భావిస్తున్నారు. ఆదివారం ఆయ‌న అనుచ‌రులు హైదర్ నగర్‌లో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే, ఊహించ‌ని రీతిలో వారికి ఎదురుప‌డ్డ మొవ్వ అనుచ‌రులు.. బైక్ ర్యాలీని అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అంత‌లోనే మొవ్వ అనుచ‌రులు ఆనంద్ ప్ర‌సాద్‌పై చెప్పులతో దాడికి కూడా పాల్ప‌డ్డారు. దీంతో ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్తంగా మారాయి. రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఇరువర్గాలను పోలీసులు సముదాయించేందుకు ప్రయత్నాలు చేశారు.

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున శేరిలింగంప‌ల్లి టికెట్ ఆశించిన ఆనంద్ ప్ర‌సాద్‌ కు భంగ‌పాటే ఎదురైంది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీలో కొన‌సాగారు. మొవ్వ స‌త్య‌నారాయ‌ణ మాత్రం మ‌ధ్య‌లో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని.. తిరిగి టీడీపీలో చేరారు. మ‌రోవైపు, శేరిలింగంప‌ల్లి టికెట్‌ను టీడీపీకి ఇవ్వొద్ద‌ని మాజీ ఎమ్మెల్యే - కాంగ్రెస్ నేత భిక్ష‌ప‌తి యాద‌వ్ పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నారు.