Begin typing your search above and press return to search.

ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ .. నగరవాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు !

By:  Tupaki Desk   |   16 Oct 2020 4:45 PM IST
ప్రారంభమైన బెజవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌ .. నగరవాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు !
X
విజయవాడ వాసుల దశాబ్దాల కల నేటికీ సాకారం అయింది. నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు రూపుదిద్దుకున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వచ్చింది. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిలు శుక్రవారం వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ ప్లై ఓవర్ పనులు పూర్తి అయ్యి చాలా రోజులు అయినప్పటికీ , కరోనా , లాక్ డౌన్ నేపథ్యంలో ప్రారంభం ఆలస్యం అవుతూ వచ్చింది . తాజాగా నేడు ఈ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం అయింది.

ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఫ్లై ఓవ‌ర్ ప్రారంభంతో పాటు రూ. 7,584 కోట్ల విలువైన 16 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు 887 కిలోమీటర్లు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. రూ. 8,083 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీతో క‌లిసి సీఎం వైఎస్ జగన్ జాతికి అంకితం చేశారు. కాగా, రూ.502 కోట్లతో ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర దుర్గ గుడి వంతెన నిర్మించబడింది. 900 పని దినాలలో ఫ్లై ఓవర్‌ పూర్తయింది.

ఈ కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2కోట్లు ఖర్చు చేసింది. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభోత్సవం పూర్తి కావడంతో అధికారికంగా వాహనాలకు అనుమతిస్తారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ఘనతను దేశానికి చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వీడియోను రూపొందించింది.