Begin typing your search above and press return to search.

సీన్లోకి వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఏం చెప్పిందంటే?

By:  Tupaki Desk   |   16 Oct 2020 11:45 AM IST
సీన్లోకి వచ్చిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ఏం చెప్పిందంటే?
X
సుప్రీంకోర్టు నెంబరు 2 న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ఏపీకి చెందిన పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన వైనం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికిరాసిన లేఖ నేపథ్యంలో పలువురు స్పందిస్తున్నారు. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీన్లోకి వచ్చింది. సుప్రీం.. హైకోర్టు జడ్జిలపై సీఎం జగన్ చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది.

వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసమే న్యాయ వ్యవస్థ స్వతంత్రతను సీఎం జగన్ దెబ్బ తీసే ప్రయత్నం చేస్తున్నారంటూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు. ఇటీవల కాలంలో న్యాయవ్యవస్థను అస్థిరపరిచే ఘటనలు పెరిగిపోయాయని.. గతంలో వివిధ వర్గాల నుంచి న్యాయమూర్తులపై విమర్శలు వచ్చేవన్నారు. ఇప్పుడు ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే విమర్శలు చేయటం ఆందోళన కలిగిస్తోందన్నారు.

కుట్రపూరితంగా న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని.. అందులో భాగంగానే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు సీఎం రాసిన లేఖను మీడియాకు విడుదల చేసినట్లుగా స్పష్టమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ పై పలు క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండటాన్ని ప్రస్తావించారు. న్యాయవ్యవస్థ గొప్పతనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత బార్ అసోసియేషన్ మీద ఉన్నందునే ఈ అంశంపై స్పందిస్తున్నట్లుగా పేర్కొన్నారు.