Begin typing your search above and press return to search.

ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరు స్థావరంగా మారుతోందని షాను కలిసి బీజేపీ ఎంపీ

By:  Tupaki Desk   |   28 Sept 2020 11:45 AM IST
ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరు స్థావరంగా మారుతోందని షాను కలిసి బీజేపీ ఎంపీ
X
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. మొన్నటివరకు ఆయనో ఎంపీ. బీజేపీలో ఆయనకంటూ ప్రత్యేకత పెద్దగా లేదనే చెప్పాలి. కానీ.. ఇప్పుడు బీజేపీ యువమోర్చా అధ్యక్షుడిగా పార్టీ పట్టం కట్టింది. సాధారణ కార్యకర్తను మోర్చా అధ్యక్షుడిగా చేయటం బీజేపీలోనే సాధ్యమవుతుందని చెప్పే ఆయన.. బలహీన వర్గాల నుంచే బలమైన నాయకులు వస్తారటానికి తన ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చారు.

బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడిగా ఎంపికైన పక్క రోజున ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు బెంగళూరు స్థావరంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తం చేయటమే కాదు.. దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. భారత సిలికాన్ వ్యాలీగా పేరున్న బెంగళూరు మహానగరం ఉగ్రవాదులకు స్లీపర్ సెల్ గా మారుతుందన్నారు.

ఇటీవల స్లీపర్ సెల్ ఉగ్ర దళాన్ని పోలీసులు భగ్నం చేశారన్న ఆయన.. ఉగ్రవాద కార్యకలాపాలకు గార్డెన్ సిటీ ఇంక్యుబేషన్ సెంటర్ గా చేసుకుంటున్నారని చెప్పారు. ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు బెంగళూరు మహానగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి షా స్పందించినట్లు తేజస్వి సూర్య చెబుతున్నారు.

తన విన్నపానికి కేంద్ర హోం మంత్రి సానుకూలంగా స్పందించారని.. త్వరలోనే ఎస్పీ కేడర్ స్థాయి అధికారిని నియమిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. శాశ్వితంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేలా అధికారులకు సూచనలు చేస్తానని షా చెప్పారన్నారు. మొన్నటి వరకు ఎంపీగా ఉన్నప్పుడు తట్టని ఆలోచన.. పార్టీ యువమోర్చా అధ్యక్షుడిగా ఎంపికైన పక్కరోజునే షాను కలవటం ఒక ఎత్తు అయితే.. ఆయన ప్రస్తావించిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.