Begin typing your search above and press return to search.

కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకునే లోపే బండి సంజయ్ కు ఏ సమాచారం అందింది?

By:  Tupaki Desk   |   14 Dec 2020 10:00 AM IST
కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకునే లోపే బండి సంజయ్ కు ఏ సమాచారం అందింది?
X
ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తులకు కమలనాథులు పైఎత్తులు వేయటమే కాదు.. ఆయన విషయంలో తాము ఎంత అప్రమత్తంగా ఉన్నామన్న విషయాన్ని చేతలతో చెప్పేశారు.తన మూడు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకొని సీఎం కేసీఆర్.. హైదరాబాద్ కు ఆదివారం సాయంత్రం చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ గడ్డ మీద కాలు మోపక ముందే.. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి పార్టీ అధినాయకత్వం నుంచి ఆసక్తికర మెసేజ్ వచ్చినట్లు చెబుతున్నారు.

ఉన్నపళంగా ఢిల్లీ బయలుదేరి రండి.. అని పేర్కొనటంతో బండి సంజయ్ హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. తన మూడురోజుల పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు మంత్రులతో భేటీ కావటం తెలిసిందే. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి మధ్య ఏకాంత చర్చలు జరగటం తెలిసిందే. తమను కలిసిన కేసీఆర్ ఢిల్లీ నుంచి బయలుదేరినంతనే.. బండి సంజయ్ ను ఢిల్లీకి రమ్మనటం వెనుక ఆసక్తికర పరిణామం ఉందన్న మాట వినిపిస్తోంది.

ఢిల్లీ పర్యటన సందర్భంగా కేసీఆర్ ప్రస్తావించిన అంశాలపై స్పష్టత ఇవ్వటానికి.. పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరిపేందుకే తాజా పిలుపు అని చెప్పక తప్పదు. గతంలో మాదిరి అనవసరమైన కన్ఫ్యూజన్ కు గురి కావటం.. కేసీఆర్ విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోవాలన్న అంశంపై తెలంగాణ బీజేపీ నేతలకు స్పష్టత ఉండేది కాదు. దీంతో వారు స్తబ్దుగా ఉండేవారు. ఇలాంటి వాటి కారణంగా జరిగే నష్టాన్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తాజాగా బండిని ఢిల్లీకి పిలిపించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనకు ఎలాంటి సందేశం అందుతుందన్నది ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. బండి మాట్లాడితే.. విషయం అంతో ఇంతో అర్థం కాక మానదు.