Begin typing your search above and press return to search.

బీజేపీ ఉప్పు.. బీఆర్ ఎస్ నిప్పు.. క‌లిసిన వేళ‌.. న‌వ్వులు విరిశాయి!!

By:  Tupaki Desk   |   31 May 2023 8:14 PM GMT
బీజేపీ ఉప్పు.. బీఆర్ ఎస్ నిప్పు.. క‌లిసిన వేళ‌.. న‌వ్వులు విరిశాయి!!
X
బీజేపీ అంటే.. బీఆర్ ఎస్‌కు ప‌డ‌దు. ఇక‌, బీఆర్ ఎస్ అంటేనే బీజేపీ ఒంటికాలిపై లేస్తుంది. మ‌రి ఇలాంటి రెండు పార్టీల కీల‌క నాయ‌కులు క‌లిసే సంద‌ర్భం వ‌స్తే.. ఎలా వ‌స్తుంది? అన‌కండి.. వ‌స్తే.. ఎలా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ‌లో అదే జ‌రిగింది. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌, బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కురాలు, సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత‌లు ఇద్ద‌రూ ఒక ఫంక్ష‌న్‌కు హాజ‌ర‌య్యారు. నిత్యం విమ‌ర్శ‌ల శ‌రాల‌తో ఒక‌రినొక‌రు విభేదించే ఈ ఇద్ద‌రు నాయ‌కులు కూడా.. సంతోషంగా గ‌డిపారు.

బద్ధ శత్రువుల మాదిరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్సీ కవిత ఒకరి మీద మరొకరు ఘాటుగా విమర్శలు చేసుకునే వారిద్దరూ ఓ శుభ కార్యక్రమానికి హాజరై కాసేపు పరస్పరం మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మ‌రో నాలుగైదు మాసాల్లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ స‌మ‌యంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ ఎస్ రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలో ఇప్పటికే రాజకీయ నాయకులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు గుప్పించుకుంటున్నారు.

ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు సంబంధం లేకుండా బద్ధ శత్రువుల మాదిరి ఆరోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన మద్యం కుంభకోణం వ్యవహారంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఎమ్మెల్సీ కవిత, బండి సంజయ్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో క‌లుసుకున్నారు.

నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు బస్వ నర్సయ్య నిజామాబాద్ నగర శివారులో నిర్మించుకున్న నూతన గృహప్రవేశ కార్యక్రమంలో సంజ‌య్‌, క‌వితలు తారసపడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, జిల్లా జడ్పీ ఛైర్మన్ విఠల్ రావును బండి సంజయ్కు కల్వకుంట్ల కవిత పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బండి సంజయ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప‌ర‌స్ప‌రం ప‌క్క‌ప‌క్క‌న కూర్చుని.. రాజ‌కీయాల‌కు అతీతంగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఒక‌రి కుటుంబ వివరాలు ఒక‌రు పంచుకున్నారు. ఇదీ.. సంగ‌తి!!