Begin typing your search above and press return to search.

బండి వారి తాజా వార్నింగ్.. వైకుంఠ రథాల్లో భగవద్గీత వద్దు

By:  Tupaki Desk   |   19 Aug 2022 6:31 AM GMT
బండి వారి తాజా వార్నింగ్.. వైకుంఠ రథాల్లో భగవద్గీత వద్దు
X
తాము అనుసరించే మత ధర్మం మీద ప్రేమ.. అభిమానం.. ఆరాధన ఉండటం తప్పేం కాదు.కానీ.. అవన్నీ కూడా మోతాదు మించని రీతిలో ఉండటం చాలా అవసరం. అందుకు భిన్నంగా మనసుకు తోచిందిచేయటం సరికాదు. ఇప్పుడు అలాంటి పనే చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.

హిందూ మతానికి జరుగుతున్న దాడి అన్న పేరుతో ఆయన తెస్తున్న పరిమితులు.. విధిస్తున్న కండీషన్లు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారంగా మారాయి.

పవిత్రమైన భగవద్గీతను ఈ మధ్యన పథకం ప్రకారం శవయాత్రల్లో వినిపిస్తున్నారని.. అలా చేస్తే దాడులు చేసి.. వైకుంఠ రథాల టైర్లను కోసేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక చింతనకు భగవద్గీత ఆలవాలమని.. అలాంటి గ్రంథాన్ని అవమానిస్తే దాడులు తప్పవని తేల్చారు. హిందువులు, ఆలయాలు, అర్చకులపై దాడి జరుగుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్న బండి.. మరిన్ని వార్నింగ్ లు ఇచ్చేశారు. తాజాగా ఆయన జరుపుతున్న పాదయాత్రలో భాగంగా ఆయనీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అధికారంలోకి వచ్చినంతనే ఇప్పుడున్న బ్రాహ్మణ పరిషత్ ను రద్దు చేసి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇకపై.. రామాయణ..మహాభారతాల్నివ్యంగ్యంగా చిత్రీకరిస్తే దాడులు చేస్తామన్నారు.

బీజేపీ ముందు కేసీఆర్ దాదాగిరి నడవన్న ఆయన.. అవసరమైతే పేదల కోసం టీఆర్ఎస్ కంటే ఎక్కువ గూండాగిరి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ .. టీఆర్ఎస్ తాటాకుచప్పుళ్లకుతాము భయపడనని చెప్పిన ఆయన.. మరో కీలక విషయాన్నిప్రస్తావించారు.

ఇటీవల జరిగిన సామూహిక గీతాలాపనలో స్వతంత్ర భారత్ కీ జై అని ఒవైసీ అనలేదన్న ఆయన.. కేసీఆర్ కు దమ్ముంటే.. ఒవైసీతో భారత్ మాతాకీ జై అనిపించాలని సవాలు విసిరారు. గూగుల్ లో బెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా అని కొడితే మోడీ పేరు వస్తుందని.. వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరు వస్తుందంటూ ఎద్దేవా చేశారు. మరి.. బండి వారి తాజా వార్నింగ్ లపై ఎవరెలా రియాక్టు అవుతారో చూడాలి.