Begin typing your search above and press return to search.

జంపింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన బాలినేని

By:  Tupaki Desk   |   20 April 2016 5:06 AM GMT
జంపింగ్‌ పై క్లారిటీ ఇచ్చిన బాలినేని
X
పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి క్లారిటీ ఇచ్చారు. మంత్రి పదవిని కూడా వదులుకుని తాను వైఎస్‌ ఆర్‌ సీపీలోకి వచ్చిన విషయాన్ని బాలినేని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ వెంటే ఉంటానని, పార్టీ మార్పులో వాస్తవం లేదని అన్నారు. అసలు టీడీపీ నేతలతోనే మాట్లాడనప్పుడు.. వాళ్లకు ఆ పార్టీలోకి వస్తానని హామీలు ఎవరిచ్చారో తెలియదని చెప్పారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌ రెడ్డి సైతం త‌న పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలలో నిజం లేదని స్ప‌ష్టం చేశారు. తామంతా బాలినేని శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని, ఇలాంటి సమయంలో తమ మనోభావాలు దెబ్బతినేలా కథనాలు రాయడం సరికాదని చెప్పారు.

మార్కాపురం ఎమ్మెల్యే - వైసీపీ నేత జంకె వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ...అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. టీడీపీ ఎన్ని కోట్లిచ్చినా తనను మాత్రం కొనలేరని వ్యాఖ్యానించారు. రాజంపల్లి తిరునాళ్లలో వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రభపై మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో కలసి కనిపించిన ఆయన ప్రసంగిస్తూ - యువనేత జగన్ ముఖ్యమంత్రి అయితే వైఎస్ ఆర్ రామరాజ్యం వస్తుందని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు వచ్చి చూసి వెళ్లడం తప్ప చంద్రబాబు మరేమీ చేయలేదని విమర్శించారు. బాబుకు ఓటు వేసిన వారు ఇప్పుడు చింతిస్తున్నారని అన్నారు. కరవుతో రైతులు - ఉద్యోగాలు లేక యువత - ఉపాధి లేక కూలీలు బాధపడుతున్నారని - ఎమ్మెల్యేలకు ఇవ్వాల్సిన నిధులను సైతం చంద్రబాబు సర్కారు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్లాలన్నా, రైతులు సుఖంగా ఉండాలన్నా జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని అన్నారు.