Begin typing your search above and press return to search.

బాలినేని బుజ్జ‌గింపులు స‌క్సెస్‌.. సీఎం ఇష్ట‌మేన‌న్న మాజీ మంత్రి

By:  Tupaki Desk   |   11 April 2022 2:42 PM GMT
బాలినేని బుజ్జ‌గింపులు స‌క్సెస్‌.. సీఎం ఇష్ట‌మేన‌న్న మాజీ మంత్రి
X
తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోయిన మాజీమంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి మెత్త‌బ‌డ్డారు. సీఎం జగన్ ఆలోచన ప్రకారమే మంత్రి పదవులు కేటాయించారని అన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన జగన్‎‎ను కలిశారు. మ‌రి లోప‌ల ఏం జ‌రిగిందో తెలియ‌దు కానీ.. బ‌య‌ట‌కు వ‌చ్చిన బాలినేని మాత్రం కూల్ అయ్యారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ పార్టీ మార్పు కేవలం ప్రచారం మాత్రమేనన్నారు. మంత్రి పదవి కోసం తానెప్పుడూ పాకులాడలేదని చెప్పారు.

మంత్రి ఆదిమూలపు సురేశ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. గతంలో సురేశ్‌తో కలిసి సమన్వ యంతో పని చేశామని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబంతో తాము సన్నిహితులమని తెలిపారు. జగన్ ఏ బాధ్యలు ఇచ్చినా స్వీకరిస్తానని బాలినేని స్పష్టం చేశారు. దీంతో బాలినేని బుజ్జగింపుల పర్వం ముగిసింద‌నే టాక్ వినిపించింది. మంత్రివర్గంలో స్థానం దక్కనందుకు నిన్నటి నుంచీ అసంతృప్తితో రగిలిపోయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎట్టకేలకు శాంతించారు.

ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకు తన ఆగ్రహాన్ని మౌనంగానే వ్యక్తపరిచిన బాలినేని.. చిట్ట చివరకు దిగివచ్చారు. ముఖ్యమంత్రి ఏం మంత్రం వేశారో గానీ.. ఆయనతో భేటీ అనంతరం పూర్తిగా కూల్ అయిపోయారు. తాను వైస్ కుటుంబానికి విధేయుడిని అని ప్రకటించుకున్న మాజీ మంత్రి.. జగన్ ఎలాంటి బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తానని చెప్పుకొచ్చారు.

కొత్త మంత్రుల జాబితాలో తన పేరు కొనసాగించకపోవడంతో బాలినేని ఆదివారం నుంచీ అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం కూడా సాగింది. దీంతో విజయవాడలోని బాలినేని నివాసానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, అనిల్, మాధవరావు వెళ్లారు. బాలినేనితో సమావేశమై.. బుజ్జగించే ప్రయత్నం చేశారు.

నిన్న(ఆదివారం) సాయంత్రం కొత్త మంత్రుల పేర్లు బహిర్గతం అయినప్పటి నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి బాలినేనితో మూడుసార్లు సమావేశమయ్యారు. నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి శ్రీకాంత్‌రెడ్డితో కలిసి మరోసారి బాలినేనిని కలిసిన సజ్జల.. ఇవాళ(సోమవారం) మూడోసారి బాలినేనితో భేటీ అయ్యారు. అయినప్పటికీ మాజీ మంత్రి మెత్తబడలేదు.

ఈ క్రమంలోనే సీఎం జగన్ స్వయంగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డితో మాట్లాడాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో.. బాలినేనిని తన వద్దకు తీసుకురావాల్సిందిగా సజ్జలను సీఎం ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి కలిసి బాలినేనిని సీఎం వద్దకు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసుకు బాలినేని చేరుకున్నారు. మంత్రిపదవి రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. భవిష్యత్ హామీలతో బానినేనిని ముఖ్యమంత్రి జగన్ బుజ్జగించారు. దీంతో.. చల్లబడిన బాలినేని తాను వైఎస్ కుటుంబానికి, వైసీపీకి విధేయుడినని ప్రకటించారు.