Begin typing your search above and press return to search.

గోస్పాడులో చక్రం తిప్పుతున్న బాలినేని

By:  Tupaki Desk   |   15 Aug 2017 1:41 PM GMT
గోస్పాడులో చక్రం తిప్పుతున్న బాలినేని
X
నంద్యాల ఉపఎన్నికలో గెలుపు తమదే అని వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఖరారు అయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ చిన్న విషయంలోనూ ఏమరుపాటుగా ఉండడానికి అవకాశం ఇవ్వడం లేదు. నంద్యాల ఉపఎన్నికలో అతి కీలకమైన గోస్పాడు మండలాల పైనే రెండు పార్టీలు అధికంగా దృష్టి సారించాయి. గత ఎన్నికల సందర్భంగా వైసిపికి ఇక్కడ 757 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఇక్కడ మొత్తం 28,844 ఓట్లు ఉండగా చాలా కీలకంగా మారిన ఈ మండల ఓటర్ల మనోగతాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రెండు పార్టీలు శాయశక్తులా కృషి చేస్తున్నాయి. ఇక్కడ అత్యధిక శాతం ఓటర్లు వైసిపికి అనుకూలంగా ఉండటం టిడిపికి ఎంత మాతం రుచించడం లేదు.నేరుగా వైసిపిని ఎదురుకునే అవకాశం లేకపోవడంతో ప్రలోభాలతో అక్కడి ఓటర్లను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్న టిడిపి ఎత్తులు పారటం లేదు.

మరోవైపు ఇక్కడ మెజారిటీ ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ఆర్ సిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి వైకాపా సీనియర్ లీడర్ మరియు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ బాలినేని శ్రీనివాసరెడ్డిని రంగంలో దించారు.ప్రచారం వచ్చే సోమవారంతో ముగుస్తుండగా జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా నుంచి నాలుగు సార్లు ఎమెల్యే గా గెలిచిన అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరుండి మరీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాజకీయంగా ప్రత్యర్థుల ఎత్తులను సమర్ధవంతంగా ఎదుర్కుని పార్టీని గెలుపు దిశగా తీసుకెళ్లడంలో అపార అనుభవం ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి స్వీయ పర్యవేక్షణలో అక్కడి వ్యవహారాలు అన్ని చక్కదిద్దుతున్నారు.

ఈ సారి ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఓట్ల మెజారిటీ రావాలని, అంత ప్రజాదరణ పార్టీకి ఉందని దానికి తగ్గట్టు బాలినేని పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు.

కార్యకర్తల్లో చైతన్యం నింపడంతో పాటు టిడిపి వేస్తున్న గాలాలు, ఎన్నికల కోసమే చేపడుతున్న తాత్కాలిక అభివృద్ధి గురించి ప్రజలకు విడమరిచి చెప్పి వాళ్ళను సరైన ఆలోచనా దిశగా నడిపిస్తున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రచారానికి చాలా మంచి స్పందన రావడం విశేషం. తన అనుచరులతో సహా అక్కడే పాగా వేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కా ప్రణాళికతో చేపడుతున్న ప్రచారం పట్ల పార్టీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు లాంచనమేనని, కాని తాము ఆశిస్తున్న మెజారిటీ తగ్గకుండా నంద్యాల ప్రజలు వైసిపి ఉన్నారని తెలుగు ప్రజలకు చెప్పడానికి చేస్తున్న ప్రయత్నమేనని బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయనతో పాటు ఉన్న ప్రచారంలో పాల్గొంటున్న నాయకులు చేసిన వ్యాఖ్యలు వైకాపా మద్దతుదారులకు ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

మొత్తానికి గోస్పాడులో బాలినేని చక్రం తిప్పుతున్నారు.