Begin typing your search above and press return to search.

ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్

By:  Tupaki Desk   |   27 April 2019 6:51 AM GMT
ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్
X
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మిర్యాలగూడులో జరిగిన ప్రణయ్ పరువుహత్య కేసులో నిందితులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.. దళిత యువకుడిని తన కూతురు అమృత ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో బడా పారిశ్రామికవేత్త మారుతీరావు ఆమె భర్త ప్రణయ్ ను కిరాతకంగా నడిరోడ్డుపై కిరాయి హంతకులతో నరికి చంపించాడు.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడుగా అమృత తండ్రి మారుతీరావు ఉన్నారు. ఆరో నిందితుడిగా అతడి సోదరుడు శ్రవణ్ కుమార్, ఐదో నిందితుడిగా కరీంలు ఉన్నారు. వీరిపై సెప్టెంబర్ 18న పోలీసులు పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరు బెయిల్ పై బయటకు వస్తే ప్రణయ్ కుటుంబానికి ప్రమాదమని భావించిన పోలీసులు పీడీ చట్టాన్ని ప్రయోగించారు. అయితే ఇంత చేసినా వీరు హైకోర్టుకెళ్లారు.

రెండు నెలల క్రితం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లా ఎస్పీ రంగనాథ్, మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ లు మారుతీరావుకు బెయిల్ ఇవ్వరాదని గట్టిగా వాధించారు. దీంతో హైకోర్టు బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. తాజాగా మరోసారి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. విచారించిన కోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ప్రస్తుతం వరంగల్ జైలులో ఉన్న వారు సాయంత్రం విడుదలయ్యే అవకాశాలున్నాయి.

కాగా తన భర్త ప్రణయ్ ను చంపిన తండ్రి మారుతీరావ్ కు బెయిల్ మంజూరు చేయడంపై అమృత తాజాగా స్పందించింది. తండ్రికి శిక్ష విధించకుండా బెయిల్ మంజూరు చేశారంటూ తన ఆవేదనను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టింది.