Begin typing your search above and press return to search.

టీడీపీకి షాక్ ఇచ్చిన జాతీయ సర్వే

By:  Tupaki Desk   |   21 Jan 2022 5:30 AM GMT
టీడీపీకి షాక్ ఇచ్చిన జాతీయ సర్వే
X
ప్రముఖ మీడియా జాతీయ స్థాయిలో నిర్వహించిన తాజా సర్వే చంద్రబాబునాయుడు ఆశలపై నీళ్ళు చల్లినట్లే ఉంది.

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సీ ఓటర్-ఇండియా టు డే సంస్ధలు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఎన్డీయే, యూపీఏతో పాటు ఇతర పార్టీలు, ప్రభుత్వాలపై దేశంలో విస్తృతమైన సర్వే నిర్వహించింది.

ఇందులో భాగంగానే ఏపీలో పరిస్ధితిపైన కూడా సర్వే చేసింది.

ఆ సర్వే వివరాలను తాజాగా వెల్లడించింది. సదరు సర్వే వివరాల ప్రకారం జనాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రజాధరణ ఏమాత్రం తగ్గలేదని తేలింది.

ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ దే అధికారం అని కూడా స్పష్టమైంది.
మెజారిటీ పార్లమెంటు స్థానాలు వైసీపీ గెలుచుకోవటంతో పాటు తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అర్ధమైంది.

అంటే తాజా సర్వే ప్రకారం జనాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నేత జగనే అని అర్ధమవుతోంది.

ఇండియా టు డే సర్వే వివరాలు ఇలాగుంటే చంద్రబాబునాయుడు మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికారం తమదే అని ఎలా చెబుతున్నారు ?

టీడీపీ అధికారంలోకి రావటం ఒకఎత్తైతే వైసీపీకి 50 సీట్లకు మించిరావని కూడా చంద్రబాబు చెబుతున్నారు. జనాల్లో జగన్ పై వ్యతిరేకత బాగా పెరిగిపోయిందని, ప్రభుత్వంపై జనాలు తీవ్రస్థాయిలో మండిపోతున్నారంటు ప్రతిరోజు ఒకటే ఊదరగొడుతున్నారు.

చంద్రబాబుకు మద్దతుగా బీజేపీ, జనసేన పార్టీల అధినేతలు కూడా ఇదే పద్దతిలో పక్కవాయిద్యం వినిపిస్తున్నారు.

జగన్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని ప్రతిపక్షాలు చెబుతుంటే జనాల్లో జగన్ ఇమేజీ ఏమాత్రం తగ్గలేదని ఇండియా టు డే సర్వేలో బయటపడింది. అంటే చంద్రబాబు అనుకుంటున్నట్లు జనాల్లో జగన్ పై అంత వ్యతిరేకత లేదని అర్ధమవుతోంది.

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలని తహతహలాడుతున్నారు కాబట్టి చంద్రబాబుకు పరిస్దితి అంతా అలాగే కనబడుతుంది.

అంతేకాదు పార్టీలో పాజిటివిటీ నింపడానికి అలా చెప్పడం అవసరం కూడా. ఇంకో సర్వేలన్నీ నూరుశాతం నిజమనేందుకు లేదు. కానీ అలాగని కొట్టి పారేయాల్సిన అవసరమూ లేదు.

తాజా సర్వేని చంద్రబాబు ప్రామాణికంగా తీసుకుని పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకోవాలి. పార్టీ పరిస్ధితిపై నిజాయితీగా ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవటంతో పాటు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవాలి.
మీడియా మీద ఆధారపడటం మానేయాలి.

ఈ మీడియాను నమ్ముకునే 2019 ఎన్నికల్లో బొక్కబోర్లాపడింది. అప్పట్లో కూడా అంతా బ్రహ్మాండమనే ఈ మీడియా చెప్పింది. కానీ ఎన్నికలో వాస్తవ పరిస్ధితి ఏమిటో బయటపడింది.

కాబట్టి ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్లు ఉంది కాబట్టి ఇప్పటి నుండి జాగ్రత్త పడితే పార్టీ బలోపేతమవ్వటం కష్టం కాదు.