Begin typing your search above and press return to search.

ఉద్యోగుల‌కు బాబు మ‌ద్ద‌తు.. తాజా పిలుపు ఇదే!

By:  Tupaki Desk   |   22 Jan 2022 10:35 AM GMT
ఉద్యోగుల‌కు బాబు మ‌ద్ద‌తు.. తాజా పిలుపు ఇదే!
X
పీఆర్సీ విషయంలో ప్రభుత్వం చేతిలో మోసపోయి పోరాటాలు చేస్తున్న ఉద్యోగులకు మద్దతు ఇవ్వాలని పార్టీ నేతలకు టీడీపీ అధినేత‌ చంద్రబాబు పిలుపునిచ్చారు. మనకు ఓటు వేశారా లేదా అనేది చర్చ కాదని.. బాధిత వర్గం ఎక్కడ ఉన్నా టీడీపీ అండగా ఉంటుందన్నారు. పార్టీ సంస్థాగత అంశాలపై మండల, నియోజకవర్గ నేతలతో తాజాగా నిర్వహించిన వీడియో సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జీతాలు పెంచమంటే.. తగ్గించిన ప్రభుత్వం ఇది మాత్రమే. ఉద్యోగులను ప్రభుత్వం తీవ్రంగా మోసగించింది...’ అని చంద్రబాబు మండిపడ్డారు.

‘రహదారులపై గుంతలు పూడ్చలేని జగన్‌... జిల్లాకో విమానాశ్రయం కడతానని చెబుతున్నారు. ప్రభుత్వ విధానాలు, పన్నులు, అధికారిక దోపిడీలతో ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభుత్వం దారుణంగా ప్రభావితం చేసింది. ఇప్పటికే కొన్ని వర్గాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడే పరిస్థితి వస్తుంది. వైసీపీ నేతలు, ఎమ్మెల్యేల దోపిడీ తీవ్రంగా ఉంది. వాటిపై మండల, నియోజకవర్గ స్థాయి టీడపీ నేతలు పోరాటాలు చేయాలి`` అని చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కొన్ని చోట్ల అనుకున్నంత ధాటిగా పోరాటాలు జరగడం లేదని బాబు అన్నారు. అలాంటి చోట్ల నేతలు తమ పని తీరు మార్చుకోవాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణపై పూర్తి సమాచారం ఉందన్న ఆయ‌న మరింత దూకుడుగా వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీకి దారుణ ఓటమి తప్పద‌న్నారు. ఈ విషయంలో ఆ పార్టీ వర్గాల్లోనే క్లారిటీ వచ్చిందని తెలిపారు. తమ కష్టాలు పోవాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారని చంద్ర‌బాబు తెలిపారు.

వ‌లంటీర్ల వ్యవస్థ ద్వారా దొంగ ఓట్లు చేర్పించడం, ఒకే కుటుంబం ఓట్లను వేర్వేరు డివిజన్లకు మార్చడం వంటి చర్యలపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని చంద్ర‌బాబు సూచించారు. ఒక రాజకీయపార్టీగా నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూనే ఉండాలన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడం కూడా ముఖ్య‌మేన‌ని తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి కొవిడ్‌ రోగులకు మళ్లీ ఉచితంగా సేవలు ప్రారంభించామ‌ని చెప్పారు. ప్రభుత్వం సాయం చేయకున్నా...ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ నుంచి ఉచిత వైద్య సాయంతో పాటు మందులు పంపిణీ చేస్తున్నామ‌ని వివ‌రించారు.