Begin typing your search above and press return to search.

బాబ్రీ మసీదు కేసు: అద్వానీ - బీజేపీ సీనియర్లకు షాక్

By:  Tupaki Desk   |   22 Aug 2020 4:30 PM GMT
బాబ్రీ మసీదు కేసు: అద్వానీ - బీజేపీ సీనియర్లకు షాక్
X
బీజేపీ కురువృద్ధులు ఎల్ కే అద్వానీ సహా బీజేపీ సీనియర్లకు మళ్లీ ఆందోళన మొదలైంది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత కేసును సెప్టెంబర్ 30 లోపు పూర్తి చేయాలని లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తిని తాజాగా సుప్రీం కోర్టు శనివారం ఆదేశించింది. విచారణ పూర్తి చేసి తుది తీర్పును వెలువరించాలని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేతలో ఎల్ కే అద్వానీ సహా బీజేపీ సీనియర్లు ప్రధాన ముద్దాయిలుగా ఉన్నారు. గతంలో సుప్రీం కోర్టు ఆగస్టు 31వరకు గడువు పొడిగించింది.

ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కురువృద్ధుడు ఎల్ కే అద్వానీ (92) - అశోక్ సింఘాల్ - మురళీ మనోహర్ జోషి - ఉమా భారతి - వినయ్ కటియార్ - గిరిరాజ్ కిషోర్ - నాటి యూపీ సీఎం కళ్యాణ్ సింగ్ లు విచారణను ఎదుర్కొంటున్నారు. వీరే కరసేవకులను రెచ్చగొట్టి బాబ్రీ మసీదును కూల్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 29 ఏళ్లుగా కోర్టుల్లో దీనిపై విచారణ సాగుతోంది.

సీబీఐ వీరందరినీ విచారించి వాంగ్మూలం స్వీకరించింది. కేసు విచారణ తుదిదశలో ఉన్న నేపథ్యంలో నేరం రుజువైతే శిక్ష కూడా పడే అవకాశం ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 30న తుది తీర్పులు వెలువడాల్సి ఉండడంతో బీజేపీ సీనియర్లలో ఆందోళన మొదలైంది.