Begin typing your search above and press return to search.

జగన్ బంధువులు అంటూ అయ్యన్న సంచలన ఆరోపణలు...?

By:  Tupaki Desk   |   20 Jan 2022 11:32 AM GMT
జగన్ బంధువులు అంటూ అయ్యన్న సంచలన ఆరోపణలు...?
X
నేరుగా జగన్ని టార్గెట్ చేస్తూ విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అంతే కాదు, ఏకంగా జగన్ బంధువులు అంటూ ఘాటైన ఆరోపణలు చేశారు. ఇవిపుడు వైరల్ గా మారుతున్నాయి. విశాఖ, తూర్పు గోదావరి జిల్లా సరిహద్దుల్లో లేటరైట్ పేరిట పెద్ద ఎత్తున బాక్సైట్ తవ్వకాలు చేస్తూ కొండలను పిండి చేసేస్తున్నారు అని అయ్యన్న కామెంట్స్ చేశారు. వారంతా ముఖ్యమంత్రి జగన్ బధువులు అని వారికి అంత గట్టి మద్దతు ఉండబట్టే ఏ అధికారీ కూడా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.

రాజకీయ బలంతోనే మైనింగ్ కార్యకలాపాలను పెద్ద ఎత్తున అక్రమంగా చేపడుతున్నారని అయ్యన్న అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి ప్రమేయంతోనే సాగుతోందని కూడా ఆయన అన్నారు. విశాఖ జిల్లా సరుగుడులో లేటరైట్ పేరుతో బాక్సైట్ ను దోచుకుంటున్నారని మాజీ మంత్రి అయ్యన్న ఆరోపణలు చేశారు. జగన్ సొంత బాబాయ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని అయ్యన్న అంటున్నారు. అలాగే ప్రతీ రోజూ మైనింగ్ చేస్తూ వందలాది లారీల్లో వేలాది మెట్రిక్ టన్నుల బాక్సైట్ ని తరలిస్తూంటే అధికారులు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇవన్నీ కూడా భారతి సిమెంటు ఫ్యాక్టరీకి తరలిస్తుంటే పోలీస్, అటవీ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు అని కూడా ఆయన పేర్కొన్నారు.

మరో వైపు చూస్తే ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రిజర్వ్ ఫారెస్టులో పది కిలోమీటర్ల మేర రోడ్డు వేస్తే, అటవీ శాఖ ఎలా అనుమతులు ఇచ్చిందని కూడా అయ్యన్న లాజిక్ పాయింట్ తీశారు. ఇక ప్రభుత్వ అండతో విచ్ఛలవిడిగా రావికంపాడు స్టేషన్ నుంచి రైల్వే వేగన్ ద్వారా వేల టన్నులు ఎగుమతి చేస్తున్నా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల అధికారులు ఏ మాత్రం పట్టనట్టుగా వ్యవహరించడం దారుణంమని అయ్యన్న అంటున్నారు.

ఇక రిజర్వ్ ఫారెస్ట్ లో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేయడం తప్పు అయితే దాన్ని ప్రజల సౌకర్యార్ధం రోడ్డు వేశానని అటవీ అధికారులు చెబుతున్నారని, ఇక అక్కడ నుంచి రోజూ వందలాది లారీలు తరలివెళ్తూంటే వాటిపై ఎటువంటి రుసుం చెల్లించకుండా భారీ వాహనాలకు ఎలా అనుమతి ఇస్తున్నారు అని మాజీ మంత్రి అటవీ శాఖ అధికారులను ప్రశ్నించారు.

మొత్తానికి చూస్తూంటే విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల సరిహద్దులో ఇంత దోపిడీ జరుగుతుంటే నర్సీపట్నం, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎందుకు ఖండించడం లేదని కూడా ఆయన నిలదీశారు. ముఖ్యామంత్రి బంధువులు అయితే ఏమైనా చేయవచ్చా చట్టలను దాటి మరీ మైనింగ్ చేయవచ్చా ఇదంతా ఒప్పు అని అధికారులు మిన్నకుంటారా అంటూ అయ్యన్న మండిపడ్డారు.

ఈ విషయాన్ని తాము సహించే ప్రసక్తి లేదని, గట్టిగా పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. అటవీ సంపదను దోచుకుంటూంటే అధికారులు చోద్యం చూడడం చరిత్రలో ఎక్కడా లేదని కూడా అయ్యన్న అంటున్నారు. మొత్తానికి రోజుకు వేలాది టన్నుల వంతుల నెలల తరబడి కొండలను తవ్వేస్తున్నారని అయ్యన్న చేసిన ఈ ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్నాయి.