Begin typing your search above and press return to search.

గంటాపై అయ్య‌న్న ఓపెన్ ఫైర్

By:  Tupaki Desk   |   9 April 2018 4:43 AM GMT
గంటాపై అయ్య‌న్న ఓపెన్ ఫైర్
X
క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరుగా ఉన్న టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు అంత‌కంత‌కూ ఎక్కువ అవుతున్నాయి. గ‌తంలో అధినేతకు భ‌య‌ప‌డి గుట్టుగా ఉంటున్న నేత‌లు కాస్తా.. అందుకు భిన్నంగా బ‌రి తెగించేస్తున్నారు. త‌మ లోప‌లి అసంతృప్తిని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ్ముళ్ల మ‌ధ్య న‌డుస్తున్న అధిప‌త్య పోరు పార్టీకి ఇబ్బందిగా మార‌ట‌మే కాదు.. అధినేత స‌మ‌ర్థ‌త‌పై కొత్త అనుమానాలు రేకెత్తేలా ఉండ‌టం గ‌మ‌నార్హం.

విశాఖ‌లో మంత్రులు గంటా.. అయ్య‌న్న‌పాత్రుడు మ‌ధ్య ప‌వ‌ర్ పోరు పాత‌దే. ఈ మ‌ధ్య‌న వారి మ‌ధ్య అధిప‌త్య పోరు అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్న వైనం తెలుగుదేశం పార్టీలో కొత్త చ‌ర్చ‌గా మారింది. తాజాగా త‌న‌కు తెలీకుండా డీఎల్ డీఏ (జిల్లా ప‌శుగ‌ణాభివృద్ధి సంస్థ‌) క‌మిటీని కొన‌సాగించ‌టంపై అయ్య‌న్న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ వ్య‌వ‌హారంలో గంటాపై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగారు మంత్రి అయ్య‌న్న‌. గంటా గ‌తాన్ని మ‌రిచిపోయి మాట్లాడుతున్నార‌న్న అయ్య‌న్న‌.. డీఎల్ డీఏ కొత్త క‌మిటీ నియ‌మిస్తే త‌న‌కు అభ్యంత‌రం లేదు కానీ.. జిల్లాకు చెందిన ఇన్ చార్జ్ మంత్రి..ఎంపీలు.. ఎమ్మెల్యేల‌కు తెలీకుండా నచ్చిన వారితో క‌మిటీ ఏర్పాటు చేయ‌టం ఏమిటంటూ ప్ర‌శ్నించారు.

మూడు పార్టీలు మారి వ‌చ్చిన వ్య‌క్తికి తెలుగుదేశం పార్టీ మంత్రి ప‌ద‌వి ఇచ్చిన విష‌యాన్ని మ‌ర్చిపోయారా? అంటూ గంటాపై వ్యంగ్యాస్త్రాల్ని సంధించిన అయ్య‌న్న‌.. తొలుత టీడీపీలో చేరారు.రాజ‌కీయ స్వ‌లాభాల కోసం ప్ర‌జారాజ్యంలో చేరారు.. ఆ త‌ర్వాత కాంగ్రెస్‌లోకి వెళ్లి.. ప‌ద‌వుల కోసం మ‌ళ్లీ టీడీపీలోకి వ‌చ్చార‌న్నారు. త‌న గ‌తాన్ని మ‌ర్చిపోయి గంటా మాట్లాడ‌టం స‌బ‌బు కాద‌న్న ఆయ‌న‌.. కొత్త క‌మిటీని రూల్స్ కు త‌గ్గ‌ట్లు ఏర్పాటు చేయాల‌న్నారు.

ఇంత‌కీ ఈ వివాదం ఎందుకు వ‌చ్చిందంటే జిల్లా ప‌శుగ‌ణాభివృద్ధి సంస్థ‌కు త‌న‌తో పాటు మూడు పార్టీలు మారిన గంటాకు స‌న్నిహితుడైన పిన‌పోలు వెంక‌టేశ్వ‌ర్లుతో క‌మిటీ ఏర్పాటు చేయ‌టంపై అయ్య‌న్న కోపంగా ఉన్నారు. తాను సిఫార్సు చేసిన టీడీపీ నేత కాశీనాయుడు పేరును ప‌క్క‌న పెట్టి.. గంటా సొంత నిర్ణ‌యం తీసుకోవ‌టంపై ఆగ్ర‌హం వ‌క్తం చేస్తున్నారు. అంత‌ర్గ‌త విభేదాల‌తో రోడెక్కిన వీరిద్ద‌రి పంచాయితీ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఇరువురికి స‌ర్దిచెప్ప‌టంలో బాబు వైఫ‌ల్యంతోనే ఇలా బ‌హిరంగంగా విమ‌ర్శించుకుంటున్నార‌న్న మాట వినిపిస్తోంది.