Begin typing your search above and press return to search.

జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడు.. దుకాణాలు మూసేయండి!

By:  Tupaki Desk   |   18 Dec 2021 2:42 PM IST
జ‌గ‌న‌న్న వ‌స్తున్నాడు.. దుకాణాలు మూసేయండి!
X
మ‌న‌ది ప్ర‌జ‌ల ప్ర‌భుత్వం.. మ‌నంద‌రి ప్ర‌భుత్వం.. అని ప‌దే ప‌దే చెప్పుకొనే ముఖ్యమంత్రి.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డుతున్నారా? ఆయ‌న ప్ర‌జ‌ల‌ను చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా వ్యాపారులు. ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో పర్యటించనున్నారు.

మహిళా కళాశాల ఎదురుగా వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి ఆయన బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సభకు చేరుకుంటారు. మార్గమధ్యలో జగన్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనుపరాడ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ సీఎంకు క‌నిపించ‌కుండా చర్యలు చేపట్టారు.

పర్యటన ముందస్తు చర్యల్లో భాగంగా 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్ తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసు ద్వారా సమాచారం అందించారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి లేనివిధంగా పూర్తిస్థాయి భద్రతా చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

కానీ, ఇలా మూసివేత‌ల వెనుక‌.. ప‌లు కార‌ణాలు ఉన్నాయ‌ని అంటున్నారు వ్యాపారులు. ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోవ‌డం.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం పెడ‌చెవిన పెడుతుండ‌డంతో.. ప్ర‌జ‌లు ఎక్క‌డ తిర‌గ‌బ‌డ‌తారో.. ఎక్క‌డ ముఖ్య‌మంత్రిని నిల‌దీస్తారో.. అనే భ‌యంతోనే ఇలా ముంద‌స్తు భ‌ద్ర‌త పేరుతో.. ప్ర‌జ‌ల కంటికి సీఎంను క‌నిపించ‌నీయ‌కుండా.. చేస్తున్నార‌ని.. అదేస‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కంటికి ప్ర‌జ‌ల‌ను క‌నిపించ‌కుండా.. అడ్డుప‌డుతున్నార‌ని.. నిప్పులు చెరుగుతున్నారు.

మ‌రి ఇప్పుడు త‌ప్పించుకున్నా.. రేపు ఎన్నిక‌ల స‌మయానికి ప్ర‌జ‌ల్లోకి రాకుండా ఉంటారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.