Begin typing your search above and press return to search.

న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? హైకోర్టు సీజే హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం !

By:  Tupaki Desk   |   7 July 2021 6:11 AM GMT
న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా? హైకోర్టు సీజే హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం !
X
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమూర్తి జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కావడంతో కృష్ణా డెల్టా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుండి ఎంఎస్‌ రామచందర్‌ రావు తప్పుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేయడంపై హైకోర్టు సీజే హిమ కోహ్లీ తీవ్రంగా ఫైర్ అయ్యారు. కోర్టుకి వచ్చే కేసుల్ని అత్యంత నిష్పక్షపాతంగా విచారించే న్యాయమూర్తులకు ఉద్దేశాలను ఆపాదిస్తారా, అలాగే ప్రాంతీయ భావంతో చూస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రథమ కోర్టు అధికారైన అడ్వొకేట్‌ జనరల్‌ న్యాయమూర్తుల నిజాయితీని అనుమానిస్తూ, ఉద్దేశాలను ఆపాదిస్తూ అవమానించడం దురదృష్టకరమని అన్నారు. కేసులను ఏ న్యాయమూర్తి విచారణ చేపట్టినా కూడా కేవలం మెరిట్స్‌ మీద వాదనలు వినిపించాలే కానీ ,ఇలా జడ్జ్ లకి నీచమైన, హీనమైన ఉద్దేశాలను ఆపాదించరాదని అన్నారు.

తెలంగాణ సర్కార్ విడుదల చేసిన జీవో 34 ఆధారంగా విద్యుత్‌ ఉత్పత్తితో పులిచింతల ప్రాజెక్టు నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారని, ఆ కారణంగా తమ సాగునీటికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుందంటూ కృష్ణా జిల్లాకు చెందిన రైతులు జి.శివరామకృష్ణ ప్రసాద్, ఎం.వెంకటప్పయ్య దాఖలు చేసిన పిటిషన్‌ ను ఏ బెంచ్ విచారించాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడిన నేపథ్యంలో ఎవరు విచారించాలన్నది నిర్ణయిస్తామని సీజే తెలిపారు. ఆ తర్వాత విచారణను రెండు, మూడు రోజుల్లో తెలియజేస్తామని వెల్లడించారు. అసలేమైంది అంటే .. మంగళవారం ఉదయం 10.30 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం కేసుల విచారణ ప్రారంభించగానే అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ నీటిపారుదల ప్రాజెక్టుల కేసులను ఈ బెంచ్ విచారించాలని తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అభ్యంతరం వ్యక్తం చేసినా జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావు నేతృత్వంలోని ధర్మాసనం కృష్ణా డెల్టా రైతుల పిటిషన్‌ ను విచారిస్తోందని అన్నారు.

అక్కడ విచారణ అపి, ఇక్కడికి బదిలీ చేసేలా చూడాలని కోరారు. జస్టిస్‌ రామచందర్‌ రావు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి విచారించరాదంటూ తెలంగాణ ప్రభుత్వం మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేసిందని రైతుల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ నివేదిక ఇచ్చారు. దీనితో హైకోర్టు సీజే జస్టిస్‌ హిమాకోహ్లీ ఈ విషయం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ముందే ఏవేవో ఊహించుకొని నిజాయితీ, నిబద్ధత ఉన్న న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని ఎలా కోరతారని ఏజీపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. న్యాయమూర్తికి ప్రాంతీయ భావాన్ని అంటగడుతూ దాఖలు చేసిన పిటిషన్‌ ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. కోర్టులో ఉండే జడ్జ్ లకి వ్యక్తిగత ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉండవని, మెరిట్స్‌ ఆధారంగా తీర్పులిస్తారని వెల్లడించారు.

డెల్టా రైతుల పిటిషన్‌ లో ఈ రెండు అంశాలు ఉన్నందున ఏ బెంచ్ విచారించాలన్న దానిపై సందేహం మొదలైంది అని , వివరణ తీసుకునేందుకు రిజిస్ట్రీ అధికారులకు తగిన సమయం ఇవ్వాల్సి ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఫోరం హంటింగ్‌ చేస్తున్నట్లుగానే మీరు ఆఘమేఘాల మీద విచారణ చేయాలని ఎందుకు కోరారని, రిజిస్ట్రీకి కొంత సమయం ఇవ్వాల్సిందంటూ వెంకటరమణ పై అసహనం వ్యక్తం చేశారు. ఏదేమైనా విచారణ ఆపాలని కోరుతూ తన ముందు ప్రస్తావించిన విషయాన్ని జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌ రావు ధర్మాసనానికి తెలియజేసి విచారణ ఆపాలని కోరాలని తెలిపారు. ఈ పిటిషన్‌ ను ఏ ధర్మాసనం విచారించాలన్నది స్పష్టం చేస్తామని అన్నారు . ఈ కేసు ఫైల్‌ను తన ముందుంచాలని రిజిస్ట్రీ అధికారులను ఆదేశించారు.