Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరే సాక్షి : సెంటిమెంట్-ను ప‌ట్టించుకోని బీజేపీ !

By:  Tupaki Desk   |   28 May 2022 3:49 AM GMT
ఆత్మ‌కూరే సాక్షి : సెంటిమెంట్-ను ప‌ట్టించుకోని బీజేపీ !
X
ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా, ఆత్మకూరు ఉప ఎన్నిక‌కు సంబంధించి నోటిఫికేష‌న్ వ‌చ్చింది. వ‌చ్చే నెల 23న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అదే నెల 26న ఫ‌లితాలు వెల్ల‌డికానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి పోటీ చేసేందుకు వైసీపీ త‌ర‌ఫున దివంగ‌త నేత మేక‌పాటి గౌతం రెడ్డి త‌మ్ముడు విక్రం రెడ్డి బ‌రిలో ఉన్నారు. టీడీపీ త‌ర‌ఫున సంప్ర‌దాయం అనుస‌రించి ఇక్క‌డ అభ్య‌ర్థిని ఉంచ‌ర‌నే అనుకుంటున్నారు. జ‌న‌సేన కూడా అదే బాట‌లో పోనున్నాయి. కాంగ్రెస్, బీజేపీల‌తోనే పేచీ ఎక్కువ‌గా ఉంది.

కాంగ్రెస్ రూట్ క్లియ‌ర్ కాలేదు కానీ బీజేపీ మాత్రం బ‌రిలో అభ్య‌ర్థిని ఉంచుతామ‌నే అంటోంది. గ‌తంలో బ‌ద్వేలు విష‌య‌మై కూడా ఇదే విధంగా ప్ర‌వ‌ర్తించి ప‌రువు పోగొట్టుకుంది.

అయినా మళ్లీ సెంటిమెంట్ ను లెక్కచేయకుండా ముందుకే పోవాలని నిర్ణయించింది. వాస్తవానికి ఇక్క‌డి స్థానం మేక‌పాటి కుటుంబానిదే ! స్థాన‌మే కాదు స్థాన బ‌లం కూడా ఆ కుటుంబానిదే!

ఎప్ప‌టి నుంచో ఆ కుటుంబం రాజ‌కీయం న‌డుపుతూ వ‌స్తోంది. దివంగ‌త నేత గౌతం రెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఆయ‌న భార్య శ్రీ‌కీర్తి బ‌రిలోకి దిగుతార‌ని భావించారంతా! అదేవిధంగా ఎన్నిక‌ల్లో గెలిచాక మేక‌పాటి నిర్వ‌హించిన శాఖ‌నే అంటే ఐటీ మరియు ప‌రిశ్ర‌మ‌ల శాఖ‌నే ఆమెకు అప్ప‌గించాల‌ని కూడా వైసీపీ అధినాయ‌క‌త్వం భావించింది.

ఉన్న‌త విద్యావంతురాలు కావ‌డంతో ఆమె అయితేనే అన్ని విధాలా ఆ శాఖ‌కు న్యాయం చేయ‌గ‌లుగుతారు అన్న భావ‌న కూడా వినిపించింది.

తాజా నోటిఫికేష‌న్ నేప‌థ్యంలో ఆమె అయితే సీన్ లో లేరు.అస్స‌లు ఆమెకు పోటీ చేసే విషయ‌మై ఇష్ట‌మే లేదు అని తేలిపోయింది. దీంతో విక్రం రెడ్డి ఎన్నిక‌ను ఏక‌గ్రీవం చేసేందుకు మార్గం సుగమం అయింద‌ని అంతా భావిస్తున్న త‌రుణాన బీజేపీ రివ‌ర్స్ గేర్ రాజ‌కీయాల్లో భాగంగా అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామ‌ని చెప్ప‌డం భావ్యంగా లేద‌ని అంటున్నారు మేక‌పాటి కుటుంబ అభిమాన వ‌ర్గాలు.