Begin typing your search above and press return to search.

సంచలనంగా అసద్ వ్యాఖ్యలు.. మోడీ సర్కారు అలా చేయనుందా?

By:  Tupaki Desk   |   14 Feb 2021 1:30 PM IST
సంచలనంగా అసద్ వ్యాఖ్యలు.. మోడీ సర్కారు అలా చేయనుందా?
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలనంగా మారారు. లోక్ సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జమ్మూకశ్మీర్ విభజన చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా అసద్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి.. మజ్లిస్ రహస్య మిత్రపక్షంగా వ్యవహరిస్తుందని.. పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయటం ద్వారా బీజేపీకి లాభం చేకూరుతుందంటూ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. మరి.. అదే నిజమైతే.. మోడీ సర్కారు ఇరుకున పడేలా అసద్ ఎందుకు మాట్లాడతారు? అన్నది ప్రశ్న.

తాజాగా అసద్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఏమంటే.. హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారన్నారు. అంతేకాదు.. చెన్నై.. బెంగళూరు.. ముంబయి.. అహ్మదాబాద్.. లక్నోలను కేంద్రప్రాంత ప్రాంతాలుగా మార్చేయటమే బీజేపీ విధానమన్నారు. అందులో భాగంగానే కశ్మీర్ ను ఒక ఉదాహరణగా మార్చారన్నారు. ఇప్పుడు కరతాళధ్వనులు చేసే వారు.. పార్టీలు తర్వాత తమ ప్రాంతాల్ని యూటీలుగా మార్చినప్పుడు గగ్గోలు పెట్టటం ఖాయమన్నారు.

మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే పార్టీలు అప్పటి పరిణామాలకు సిద్ధంగా ఉండాలన్న హెచ్చరికను చేసిన అసద్.. జమ్ముకశ్మీర్ లో 4జీ సేవల్ని దయతలచి ఇవ్వలేదన్నారు. అమెరికా ఒత్తిడితోనే ఆ సౌకర్యాన్ని పునరుద్దరించారన్నారు. అమెరికా ప్రకటన చేసిన రెండు రోజులకే 4జీ సేవల్ని ఇవ్వటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ఏమైనా.. మోడీ సర్కారు ఫ్యూచర్ ప్లాన్ అంటూ.. కేంద్రపాలిత ప్రాంతాల అంశంపై టీఆర్ఎస్ నేతలు ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.