Begin typing your search above and press return to search.

'కోడ్' మాటతో చెలరేగిపోయిన ఓవైసీ

By:  Tupaki Desk   |   21 Oct 2016 5:21 AM GMT
కోడ్ మాటతో చెలరేగిపోయిన ఓవైసీ
X
బహిరంగ సభ అన్న వెంటనే మధ్యాహ్నం.. సాయంత్రం వేళల్లో గుర్తుకు వస్తాయి. కానీ.. పాతబస్తీలో నిర్వహించే బహిరంగ సభలన్నీ రాత్రి వేళ బాగా పొద్దుపోయాకే మొదలవుతుంటాయి. అంత రాత్రివేళ నిర్వహించే బహిరంగ సభకు జనాలు వస్తారా? అన్న సందేహం అక్కర్లేదు. ఈ సభలకు ఇసుక వేస్తే రాలనంతగా జనాలు వచ్చేస్తుంటారు. పాతబస్తీలోని దారుస్సలాం మైదానంలో జరిగే సభలో అహుతులు.. ఆహ్వానితులు ఎవరుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా నడుస్తున్న హాట్ హాట్ చర్చల్లో తలాక్ అంశం ఒకటి. పలువురు ముస్లిం మహిళలు వ్యతిరేకిస్తున్న ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేయాలంటూ గళం విప్పారు. దీనిపై సుప్రీం.. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది.

ట్రిపుల్ తలాక్ ముచ్చటను పక్కన పెట్టేసి.. దేశంలోకి ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలన్న కుట్ర జరుగుతోందన్న వాదన ఒకటి తెర మీదకు వచ్చింది. ట్రిపుల్ తలాక్ పై ముస్లిం పర్సనల్ లా బోర్డును అభిప్రాయం అడగటం.. ప్రశ్నావళిని నింపాలన్న మాటకు ఉమ్మడి సివిల్ కోడ్ ముచ్చటను తెర మీదకు తెస్తున్న ముస్లిం నాయకులు.. ముస్లిం మత పెద్దలు ఇప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉమ్మడి సివిల్ కోడ్ తో దేశాన్ని హిందూ దేశంగా మార్చే కుట్ర చేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు.

ఇలాంటి వేళ.. పాతబస్తీలో ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా భారీ బహిరంగ సభనే ఏర్పాటు చేశారు. ఉలేమాలతో కూడిన ముస్లిం యునైటెడ్ ఫోరం అధ్వర్యంలో జరిగిన ఈ సభలో మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రసంగించారు. ముస్లింలను అణగదొక్కేందుకే ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తుందని ఆరోపించిన ఆయన.. ముస్లిం పర్సనల్ లాలో జోక్యాన్ని ముస్లింలు భరించలేరని వ్యాఖ్యానించారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని.. గోవధపైనే సంఘ్ పరివారం 70 ఏళ్లుగా మాట్లాడుతున్నారని.. రాజ్యాంగంలో మధ్య నిషేధాన్ని అమలు చేయాలని ఉన్నా.. ఇప్పటివరకూ ఎవరూ దాన్ని అమలు చేయలేదని వ్యాఖ్యానించారు.

ముస్లింల మీద బీజేపీ సర్కారుకు ప్రేమాభిమానాలు ఉంటే గుజరాత్ లో 2002లో జరిగిన ఊచకోతలో హత్యకు గురైన మాజీ ఎంపీ ఎహ్ సాన్ జాక్రీ కేసులో దోషుల్ని శిక్షించి.. ఆయన భార్య జకియాకు న్యాయం చేయాలన్నారు. గుజరాత్ లో భర్తల్ని కోల్పోయిన ముస్లిం మహిళలకు న్యాయం చేయాలని.. బాబ్రి మసీదును కూల్చివేసి 24 ఏళ్లు అవుతున్నా దోషులపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదన్నారు.

దేశంలోని హిందువులు వివిధ రాష్ట్రాల్లో వివిధ సంప్రదాయాల్లో పెళ్లిళ్లు చేసుకుంటారని.. ఉమ్మడి పౌరస్మృతి ద్వారా వారు ఏ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకోవాలో తెలపాలన్న ఓవైసీ.. దేశంలో17 కోట్ల మంది ముస్లింలు ఉంటే వారిలో7.36 కోట్ల మంది పెళ్లిళ్లు జరగ్గా.. 2.70 లక్షల ముస్లింలు మాత్రమే విడాకులు పొందినట్లు వెల్లడించారు. సంప్రదాయాల గురించి మాట్లాడుతున్న ఓవైసీ.. ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో ఒక వ్యక్తి ఒక మహిళను పెళ్లి చేసుకోవటం కాకుండా.. అధికారికంగా ఒక వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకోవటం ఇంకా కొనసాగించాల్సి ఉందా? ముస్లిం దేశాల్లో సైతం తలాక్ ను బ్యాన్ చేసిన వైనంపై ప్రపంచ ముస్లింగా ఓవైసీ ఎందుకు మాట్లాడరు.

తాను మొదట మతానికి ప్రాధాన్యత ఇస్తానని.. ఆ తర్వాతే దేశమన్నట్లుగా మాటలు చెప్పే ఓవైసీ.. మరి.. తానంతగా ప్రేమించే మతాచారాన్ని పలు ముస్లిం దేశాలు మార్చేయటంపై ఒక్కసారంటే ఒక్కసారైనా తన అభ్యంతరాల్ని ఎందుకు వ్యక్తపర్చలేదు? గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడుతున్న ఓవైసీ.. దానికి కారణమైన గోద్రా మారణకాండ గురించి ఎందుకు మాట్లాడరు? ఆ అరాచకంపై ఇప్పటివరకూ ఓవైసీ విచారం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని మర్చిపోకూడదు. అంతేనా.. బాబ్రీ మసీదు అంటూ బహిరంగ సభలో మాట్లాడుతున్న ఓవైసీ.. సుప్రంకోర్టు ఆదేశాల ప్రకారం.. అయోధ్యలోని కట్టడాన్ని ‘‘వివాదాస్పద కట్టడం’’గా మాత్రమే వ్యవహరించాలి. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని తుంగలోకి తొక్కినట్లుగా పదే పదే వేరే పేరుతో అయోధ్యలోని వివాదాస్పద కట్టడాన్ని వ్యవహరించటాన్ని ఏమనాలి? సమస్యను పక్కదారి పట్టించేలా మాట్లాడుతూ.. ఉమ్మడి పౌరస్మృతి బూచితో ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు విఘాతం కలిగేలా వ్యవహరిస్తున్న ఓవైసీ లాంటి వారిని మేధావులు ఎందుకు తప్పు పట్టరు? ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై చర్చ ఎందుకు పెట్టరు..?