Begin typing your search above and press return to search.

దళిత బంధు తరహా పథకం కావాలి : అసదుద్దీన్‌ డిమాండ్

By:  Tupaki Desk   |   28 Sep 2021 7:36 AM GMT
దళిత బంధు తరహా పథకం కావాలి : అసదుద్దీన్‌ డిమాండ్
X
తెలంగాణ లో కేసీఆర్ ప్రభుత్వంఅమల్లోకి తీసుకొచ్చిన దళిత బంధు పథకం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

దళిత బంధు తరహాలో పేద ముస్లిం కుటుంబాలకు కూడా నగదు బదిలీ లబ్ధి చేకూర్చాలని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం హైదరాబాద్‌ నాంపల్లిలోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో ‘తెలంగాణలో ముస్లిం‘లు అనే అంశంపై జరిగిన చర్చా వేదికలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రం మొత్తం మీద 8.8 లక్షల ముస్లిం కుటుంబాలు ఉండగా, అందులో రెండు శాతం మంది అత్యంత దుర్భర జీవనం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వీరిలో కనీసం ఒక శాతం కుటుంబాలకైనా దళిత బంధు తరహా పథకం వర్తింపజేయాలని కోరారు. కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అందిస్తే రూ.900 కోట్లు దాటదని, బడ్జెట్‌ లో సైతం 0.8 శాతం మించదని చెప్పారు. ఒకే విడతగా సాధ్యం కాని పక్షంలో రెండు విడతలుగా నగదు బదిలీ చేయవచ్చని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దళిత బంధు పథకం చర్చకు వచ్చినప్పుడు పేద ముస్లిం వర్గాలకు కూడా ఆర్థిక చేయూత అమలు కోసం సీఎం కేసీఆర్‌ కు విజ్ఞప్తి చేస్తామని అసదుద్దీన్‌ చెప్పారు.

కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని వర్గాలతో పాటు ముస్లిం కుటుంబాల ఆర్థిక పరిస్థితి మరింత ఛిన్నాభిన్నమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల ఆర్థిక స్థితిగతులపై సుధీర్‌ కమిషన్‌ సమర్పించిన నివేదిక సైతం దళితుల కంటే ముస్లింలు వెనుకబడి ఉన్నారని పేర్కొందని గుర్తుచేశారు. ముస్లిం వర్గాలు అక్షరాస్యతలో సైతం వెనుకబడ్డారని, పై తరగతులకు వెళ్తున్న కొద్దీ డ్రాప్‌ అవుట్‌ శాతం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నాలుగు శాతం మించి ముస్లింలు లేరని, భూములు కలిగిన వారు 9 శాతం మాత్రమే ఉన్నారని పలు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ చర్చా వేదికలో ముస్లిం ఆర్థిక సామాజిక స్థితిగతుల విచారణ కమిషన్‌ చైర్మన్‌ జి.సుధీర్, ప్రొఫెసర్‌ అమీరుల్లా ఖాన్‌ తదితరులు పాల్కొన్నారు.

బీపీఎల్ కింద ఒక్కశాతం జనాభా నివసిస్తున్నారని.. సుమారు 18,000ల ముస్లీం కుటుంబాలు అందులోకి వస్తాయన్నారు. అటువంటి పేద వారిలో ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున అందించాలని కోరారు. ఈ ఆర్థిక సహాయాన్ని రెండు విడతలుగా అందించవచ్చని సూచించారు. ఒక ఏడాదిలో రూ.5లక్షలు, మరో ఏడాదిలో మరో ఐదు లక్షల చొప్పున అందించవచ్చని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముస్లిం సోదరులకు ఆర్థిక సాయం చేసి ఆదుకోవడం వల్ల వారి అభివృద్ధికి దోహదం చేసినవారవుతారని అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ను కోరారు. రాష్ట్రంలో ముస్లింల అక్షరాస్యత 77శాతం వరకు ఉందని అసదుద్దీన్ ఓవైసీ వెల్లడించారు.