Begin typing your search above and press return to search.

నై జవాన్ : బీజేపీ దేశభక్తి మీద అగ్గి వర్షం!

By:  Tupaki Desk   |   17 Jun 2022 10:30 AM GMT
నై జవాన్ : బీజేపీ దేశభక్తి మీద అగ్గి వర్షం!
X
జై జవాన్ జై కిసాన్ అన్నది పూర్వ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి నినాదం. ఆయన రెండేళ్ళ పాటు ఈ దేశాన్ని పాలించినా ఆయన పాలన ఒక స్వర్ణ యుగంగా ఈ రోజుకీ చెప్పుకుంటారు. ఈ దేశానికి రైతు, సైనికులే పట్టుకొమ్మలు అని నినదించిన మహానుభావుడు ఆయన. వారిద్దరిలో నిండా దేశభక్తి ఉంటుందని నమ్మిన నేత శాస్త్రి. ఇక దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే మాట చెబుతుంది. అందరి కంటే దేశభక్తి పాళ్ళు ఎక్కువగా ఉన్న బీజేపీ అయింతే ఈ నినాదాన్ని ప్రసాదంగా కళ్ళకు అద్దుకుంటుంది.

కానీ ఆచరణలో మాత్రం బీజేపీ తీసుకుంటున్న కొన్ని రకాలైన చర్యల వల్ల నై కిసాన్, నై జవాన్ గా రివర్స్ అవుతోందా అన్న చర్చ అయితే వస్తోంది. నిన్నటికి నిన్న సాగు చట్టాల విషయంలో రైతాంగం అంతా ఈ దేశంలో ఏడాదికి పైగా ఆందోళన చేశారు. వారు రోడ్ల మీదకు వచ్చి తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. అన్నం పెట్టే రైతు ఆగ్రహం ఏంటో నాడు దేశం మొత్తం చూసింది.

ఇక ఇపుడు దేశానికి రక్షణగా ఉన్న జవాన్లు మండిపోతున్నారా అంటే జవాబు అవును అనే వస్తోంది. ఈ దేశానికి సేవ చేయాలనుకునే వారు ప్రపంచంలోనే మెండుగా నిండుగా ఉన్న యువత ఇపుడు భగ్గుమంటోంది. అగ్నిపధ్ కి వ్యతిరేకంగా దేశాన్ని మండిస్తోంది.

ఇంతకీ జరిగిందేంటి, ఇందులో బీజేపీ పాలకులు ఏం చేశారు అని ఆలోచిస్తే గత కొన్నేళ్ళుగా ఆర్మీ రిక్రూట్మెంట్లు లేవు. లక్షల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీ అగ్నిపధ్ పేరిట తీసుకువచ్చిన కొత్త పధకం తో కొన్ని వేల ఉద్యోగాలు మాత్రమే లభిస్తాయి. అంతే కాదు కేవలం నాలుగేళ్ల కాల పరిమితి మీదనే ఈ ఉద్యోగాలు తీస్తున్నారని, ఇది తమ భవిష్యత్తుకు గొడ్డలి పెట్టు అని యువత ఆక్రోసిస్తోంది.

ఇది మంచి విధానం కాదని, పాత పద్ధతిలోనే నియామకాలు చేయాలని, లక్షల ఖాళీలను ఒకేసారి భర్తి చేయాలని కూడా కోరుతోంది. ఇక ఆర్మీ నిపుణులు కూడా ఈ స్కీమ్ మంచిది కాదనే అంటున్నారు. నాలుగేళ్ల పాటు శిక్షణ పొందిన తరువాత తుది పరీక్షలో ఫెయిల్ అయితే ఇక వారి సంగతేంటి అన్న చర్చ వస్తోంది. అలాగే వారు ఆ శిక్షణతో ఉగ్రవాద శిబిరాల్లో చేరితే దేశ రక్షణ సంగతి కూడా ఏమిటి అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఒక వైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ వంటి దేశాలు భారత్ వైపు చూస్తున్న క్రమంలో ఆర్మీలో సంస్థాగతంగా లోపాలు ఉండేలా స్కీమ్ ని తేవడం తగదని కూడా అంటున్నారు. దేశ భద్రతకు సంబంధించిన ఆర్మీలో నాలుగేండ్ల పరిమిత కాలంతో ఓ స్కీమ్‌ను తీసుకురావడం ఎంతో ప్రమాదమైన చర్య అని కూడా అంటున్నారు.

ఇక నాలుగేండ్ల కాలం పూర్తిచేసుకొని ఎంపిక కాని అభ్యర్థులు నిరుద్యోగులుగా మిగిలిపోవాలా? వారికి ప్రభుత్వం ఇచ్చే ఉపాధి భరోసా ఏంటి అన్న ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం అయితే లేదు. ఇక అగ్నిపధ్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయీ అంటే దానికి కారణం మరోటి ఉంది. రక్షణ విభాగాల్లో వేతనాలు, పింఛన్ల భారాన్ని తగ్గించుకోవడానికే ఈ స్కీమ్‌ తీసుకొచ్చినట్లుందని కూడా అంటున్నారు. డబ్బుల కోసం శక్తివంతమైన సాయుధ దళాలను నాశనం చేయవద్దని మాజీ మిలటరీ అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు.