Begin typing your search above and press return to search.

ఇంత జరుగుతున్నా ఢిల్లీ ప్రజలకు బుద్ది రావట్లేదే?

By:  Tupaki Desk   |   17 Nov 2020 10:30 AM IST
ఇంత జరుగుతున్నా ఢిల్లీ ప్రజలకు బుద్ది రావట్లేదే?
X
ఇప్పటికే ఒకసారి కరోనా వేవ్ తో దేశ రాజధాని ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి కావటం తెలిసిందే. వైద్యసేవలకు తీవ్ర విఘాతం కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం కాస్త కోలుకొన్న మహానగరానికి మళ్లీ కరోనా పీడ మొదలైంది. సెకండ్ వేవ్ విరుచుకుపడినట్లుగా చెబుతున్న వేళ.. భారీగా కేసులు నమోదవుతున్నాయి. దీనికి తగ్గట్లు.. శీతాకాలం కావటంతో కేసుల నమోదు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ఇలాంటివేళ.. ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉంటారని భావిస్తాం. కానీ.. అలాంటిదేమీ లేదన్న విషయం తాజాగా విడుదలైన గణాంకాల్ని చూస్తే ఇట్టే అర్థం కాక మానదు. ఓవైపు కేసుల నమోదు ఎక్కువగా ఉన్నప్పటికీ.. కరోనా నిబంధనల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు షాకింగ్ గా మారింది. కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. కరోనా నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు.

సోమవారం ఒక్కరోజులోనే కరోనా నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా గుర్తిస్తూ 1489 మందిపై చలానాలు విధించారు. ముఖానికి మాస్కు పెట్టుకోకపోవటం.. రోడ్ల మీద ఉమ్మి వేయటం.. భౌతిక దూరాన్ని పాటించకపోవటం లాంటి తప్పులపై పోలీసులు కొరడా ఝుళిపించారు. కరోనా ఎపిసోడ్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 5.21లక్షల చలాన్లు జారీ చేశారంటే.. ఢిల్లీ ప్రజల ఉల్లంఘనలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం కాక మానదు.

వీరిలో ముఖానికి మాస్కులు ధరించని వారు5.17లక్షలు కావటం గమనార్హం. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తూ.. చలనాల బారిన పడిన వారు 3325 మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. కేసులు భారీగా పెరుగుతున్న వేళ.. దేశ రాజధాని ప్రజలు ఇంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరించటం చూస్తే.. ఆ నగరంలో కేసులు భారీగా నమోదుకావటానికి విషయం అంతో ఇంతో అర్థమవుతుందని చెప్పక తప్పదు.